UAE-India Flight Ticket Prices Fall: యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు హ్యాపీ న్యూస్. గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన విమాన టిక్కెట్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. విమానయాన సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం, నిలిపివేసిన విమానాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడం, సీట్ల సంఖ్యను పెంచడం వల్ల ధరలు దిగి వస్తున్నాయి. ముఖ్యంగా కేరళకు వెళ్లే మార్గాల్లో టిక్కెట్ ధరలు గణనీయంగా తగ్గాయి. గతంలో కొన్ని మార్గాల్లో టిక్కెట్ ధరలు 3,500 దినార్స్(రూ.81,550) నుంచి 3,600 దినార్స్(రూ.83,880) వరకు చేరుకోగా, ఇప్పుడు సుమారు 2,600 దినార్స్(రూ.60,580) వరకు పడిపోయాయి.
యూఏఈ-భారత్ మార్గం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమాన మార్గాల్లో ఒకటి. ముఖ్యంగా యూఏఈలో పనిచేస్తున్న భారతీయులు సెలవుల సమయంలో కుటుంబాలను కలిసేందుకు పెద్ద ఎత్తున స్వదేశానికి వెళ్తుంటారు. జూలై, ఆగస్టు నెలల్లో పాఠశాల సెలవులు కూడా ఉండటంతో ఈ సమయంలో ప్రయాణ డిమాండ్ మరింత పెరుగుతుంది. గత కొంతకాలంగా ప్రాంతీయ పరిస్థితుల కారణంగా కొన్ని విమాన సర్వీసులు తగ్గాయి. సీట్ల కొరత ఏర్పడి, టిక్కెట్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి రావడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను తిరిగి పెంచుతున్నాయి. అదనపు సీట్లు అందుబాటులోకి రావడంతో ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.
ప్రత్యేకంగా కొచ్చి, కోజికోడ్ వంటి కేరళ నగరాలకు వెళ్లే మార్గాల్లో ఎక్కువ మార్పు కనిపిస్తోంది. కొన్ని తక్కువ ధరల విమాన సంస్థలు కూడా అదనపు సర్వీసులను ప్రారంభించడంతో పోటీ పెరిగి, ఛార్జీలు తగ్గాయి. కొన్ని మార్గాల్లో టిక్కెట్ ధరలు 300 దినార్స్(రూ.7,000) నుంచి 400 దినార్స్(రూ.9,300)వరకు తగ్గినట్లు ట్రావెల్ నిపుణులు వెల్లడించారు. అయితే, ఈ తగ్గింపు చాలా రోజులు ఉండదని చెప్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ధరల తగ్గుదల కేవలం కొద్ది రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే వేసవి సెలవుల సమయంలో డిమాండ్ ఇంకా భారీగానే కొనసాగుతోంది. ప్రయాణ తేదీలు దగ్గరపడే కొద్దీ టిక్కెట్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ విమాన ఛార్జీలు 15 నుంచి 20 శాతం వరకు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ప్రయాణం ప్లాన్ చేసుకునే వారు టిక్కెట్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తక్కువ ధరలు కనిపించిన వెంటనే బుకింగ్ చేసుకోవడం ఉత్తమమని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు. యూఏఈ-భారత్ విమాన ఛార్జీలలో ప్రస్తుతం కొంత ఉపశమనం కనిపిస్తున్నప్పటికీ, ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదనపు విమాన సర్వీసులు కొనసాగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ, సమ్మర్ రష్ పెరిగితే టిక్కెట్ల ధరలు మళ్లీ పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు.
Read Also: బోర్డింగ్ పాస్ ఉన్నా విమానం ఎక్కనివ్వలే.. సీన్ కట్ చేస్తే స్పైస్ జెట్ కు షాక్!