238 Vande Metro Trains: ముంబైలో రోజూ లక్షలాది మంది ప్రయాణించే సబర్బన్ రైల్వే వ్యవస్థను మరింత అత్యాధునికంగా మార్చేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 238 వందే మెట్రో సబర్బన్ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. 2030 నాటికి ముంబై రైల్వే నెట్వర్క్ ను ఆధునికీకరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ రైళ్లను తీసుకురానున్నారు. కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, ఏసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది.
ఈ రైళ్ల తయారీని విదేశీ కంపెనీలకు అప్పగించడం కంటే దేశీయంగా చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF), రాయ్బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ (MCF)లో వీటిని తయారు చేయనున్నారు. ఈ మూడు ఫ్యాక్టరీలకు రైలు కోచ్ల తయారీలో ఇప్పటికే మంచి అనుభవం ఉంది. ముఖ్యంగా ICF వందే భారత్ రైళ్ల తయారీలో కీలక పాత్ర పోషించింది. మూడు ఫ్యాక్టరీల్లో తయారు చేయడం వల్ల రైళ్ల తయారీ వేగం పెరగడంతో పాటు దేశీయ తయారీ సామర్థ్యం కూడా మరింత బలోపేతం కానుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 2,856 ఏసీ సబర్బన్ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 12, 15, 18 కోచ్లతో కూడిన రైళ్లను నడిపే అవకాశం ఉంది.
ముంబైలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఎక్కువ కోచ్లతో కూడిన రైళ్లను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా CSMT–కళ్యాణ్, చర్చ్ గేట్–విరార్ వంటి మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ సామర్థ్యం కలిగిన రైళ్లు ప్రయాణికుల ఇబ్బందులను కొంతవరకు తగ్గించవచ్చు.
కొత్త వందే మెట్రో రైళ్లలో ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఏసీ వ్యవస్థతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని రైల్వే భావిస్తోంది. రద్దీని బట్టి ఏసీ పనితీరును సర్దుబాటు చేసే స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థలు ఉండనున్నాయి. దీంతో అవసరం లేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. కొత్త రైళ్లలో రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. రైలు బ్రేక్ వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని తిరిగి విద్యుత్గా మార్చి రైల్వే విద్యుత్ వ్యవస్థకు అందించే అవకాశం ఉంటుంది.
ముంబైలో రద్దీ, కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణాను బలోపేతం చేయడం చాలా అవసరం. అత్యాధునిక ఏసీ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే కొంతమంది ప్రయాణికులు రైల్వే వైపు మళ్లే అవకాశం ఉంది. 238 వందే మెట్రో రైళ్ల ప్రాజెక్టు పూర్తయితే ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక రైళ్లు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలతో సిటీ రవాణాను మరింత ఈజీగా మారనుంది.
Read Also: 7 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రైళ్లు వస్తున్నాయంటే?