Bengaluru: బెంగళూరు నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని ఘటనలు సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కోరమంగల, బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో యువత పరిమితికి మించి మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది కంటే ఈసారి పరిస్థితి మరింత మితిమీరినట్లు కనిపిస్తోంది.
వేడుకల పేరుతో పీకలదాకా తాగి.. స్పృహ కోల్పోయి ఫుట్పాత్లపై పడిపోవడం వంటి దృశ్యాలు “డర్టీ కల్చర్”ను ప్రతిబింబిస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువతులు.. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగడం గమనార్హం. స్వేచ్ఛ, హక్కుల పేరుతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్ల వారికే భద్రతా పరమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మత్తులో ఉన్న సమయంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే.. దానికి బాధ్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన యువత ఇలా నడిరోడ్డుపై పడి ఉండటం వారి తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చే అంశం. పిల్లలు ప్రయోజకులు అవుతారని ఆశించే వారు.. ఇటువంటి దృశ్యాలను చూసి జీర్ణించుకోవడం కష్టం. ఎంజాయ్ చేయడం అంటే కేవలం మద్యం సేవించి విచక్షణ కోల్పోవడం కాదని.. సంస్కారం, ఆత్మరక్షణ కూడా ముఖ్యమని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి.