AV Ranganath: తెలంగాణ హైకోర్టులో లోతుకుంట సర్వే నంబర్ 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్రటరీ ర్యాంకులో ఉన్న ఉన్నతాధికారి ఇలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ని ఆదేశించింది.
ఇదే సమయంలో రంగనాథ్పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంటూ, ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రంగనాథ్ కోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని, లోతుకుంట స్థలంలోకి హైడ్రా వెళ్లలేదని తెలిపారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని కోర్టుకు వివరించినప్పటికీ, హైకోర్టు తీవ్రంగా పరిగణించి కీలక ఆదేశాలు జారీ చేసింది.