Mahabubabad: శరీరానికి వైకల్యం ఎదురైనా సాధించాలనే దృఢ సంకల్పానికి ఏదీ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఈ ఆదర్శ దివ్యాంగుడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపోసపల్లికి చెందిన రమణాచారి 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయారు. అయినా అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు.
కాళ్లు లేకపోయినా చేతివృత్తినే నమ్ముకుని కార్పెంట్రీ, వెల్డింగ్ పనుల్లో విశేష నైపుణ్యం సాధించి తన కుటుంబాన్ని గౌరవంగా పోషిస్తున్నారు. అయితే, జీవనోపాధి కోసం నిత్యం రాకపోకలు సాగించడం ఆయనకు పెద్ద రవాణా సమస్యగా మారింది. స్వయంగా ఉపాధి పొందుతున్న తనకు ఒక మోటార్ సైకిల్ కేటాయించాలని అధికారులకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.