మద్యం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. మద్యం బానిసైన వాళ్లు, మందు లేకపోతే బతకలేరు. మద్యం కోసం తహతహలాడుతూ ఎంతటి ఘోరానికైనా పాల్పడుతారు. ఏం చేసైనా సరే మందు తాగుతారు. ఒకవేళ తాగేందుకు డబ్బు లేకపోతే రాక్షసులుగా మారిపోతారు. ఆ కోపంలో ఏం చేస్తున్నారో అర్థం కాదు. అచ్చంగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడు ఏకంగా అపార్ట్ మెంట్ సెల్లార్ లో పార్క్ చేసిన వాహనాలను తగలబెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పింప్రి-చించ్వాడ్ లో తాగుబోతు పైత్యం
మహారాష్ట్రలోని పింపుల్ నీలఖ్ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న 27 ఏళ్ల యువకుడు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవపడ్డాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని తేల్చి చెప్పింది. ఎంత సేపు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో ఊగిపోయాడు. తల్లి మీద కోపంతో అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చాడు. అక్కడ అన్ని బైకులు పార్క్ చేసి ఉన్నాయి. అందులో ఉన్న తన తల్లి, సోదరుడి బైకులకు నిప్పు అంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న మరో 11 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన మార్చి 5న తెల్లవారుజామున జరిగింది. ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
https://twitter.com/PTI_News/status/1899406206826950906
బాధితుడి ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజం
ఇక బైకులు కాలిపోయిన విధానం పట్ల అపార్ట్ మెంట్ లోని ఓ 62 ఏళ్ల వ్యక్తికి అనుమానం కలిగింది. కాలిపోయిన బైకులలో అతడి బైక్ కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సంఘ్వి పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అపార్ట్ మెంట్ లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది అదే ఆపార్ట్ మెంట్ లో ఉంటున్న స్వప్నిల్ శివ శరణ్ పవార్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: పాపం.. విమానం దిగే వరకు ఉగ్గబెట్టుకుని కూర్చున్న ప్రయాణీకులు.. అసలు ఏమైంది?
పోలీసులు ఏం చెప్పారంటే?
మద్యానికి తన తల్లి డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే నిందితులు శివ బైకులకు నిప్పు పెట్టాడని పోలీసులు తెలిపారు. “నిందితుడు తాగుడుకు బానిస అయ్యాడు. మద్యం కొనేందుకు డబ్బులు కావాలని అతడి తల్లిదండ్రులను, సోదరుడిని వేధించేవాడు. గత మంగళవారం రాత్రి పవార్ తన తల్లి మద్యం కోసం డబ్బు ఇవ్వకపోవడంతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఆవేశంతో పవార్ పార్కింగ్ స్థలానికి వెళ్లి తన తల్లి, సోదరుడి బైకులకు నిప్పంటించాడు. మంటలు త్వరగా వ్యాపించి 11 ఇతర వాహనాలు కాలిపోయాయి” అని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.
Read Also: పాకిస్థాన్ లో ప్రయాణికుల రైలు హైజాక్ – 100 మందికి పైగా బందీ – ఉగ్రవాదుల డిమాండ్లు ఇవే