సాధారణంగా భర్తలు మద్యానికి అలవాటు పడి భార్యలను వేధిస్తుంటారు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కొడుతుంటారు. నానా రభస చేస్తుంటారు. పిల్లలను పట్టించుకోరు. మంచి చెడులు చూసుకోరు. గాలికి పోయే గొడవలను ఇంటి మీదికి తీసుకొస్తారు. ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. భర్తల వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది భార్యలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటనలను చూశాం. వారిని నాలుగు ఉతుకులు ఉతికించి దారికి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మనం పూర్తి డిఫరెంట్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. భార్యలు తాగుడుకు బానిలసై తమను వేధిస్తున్నారంటూ భర్తలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాగుడుకు బానిసలైన మహిళలలు
తెలుగులో వచ్చిన ‘జంబలకిడిపంబ’ సినిమా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇందులో మగాళ్లు ఆడాళ్ల మాదిరిగా, ఆడాళ్లు మగాళ్ల మాదిరిగా వ్యవహరిస్తారు. అప్పట్లో ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ కొట్టింది. డిఫరెంట్ స్టోరీ కావడంతో అందరినీ భలే ఆకట్టుకుంది. అచ్చంగా ఇప్పుడు ఈ సినిమా కథ మాదిరిగానే ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పూజారిపుట్ గ్రామంలో మహిళలు వ్యవహరిస్తున్నారు. ఈ ఊరి ప్రజలంతా తాగుడుకు బానిసలై మగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి వేధింపులను తట్టుకోలేక భర్తలంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
Read Also: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు మ్యూజియం, ఇక్కడ ఎన్ని రకాల బీర్లు ఉంటాయో తెలుసా?
సారా తయారీ కేంద్రంగా పూజారిపుట్
పూజారిపుట్ పంచాయతీ పరిధిలోని కొండగూడ గ్రామంలో కొందరు యువకులు గత నాలుగు సంవత్సరాలుగా విపరీతంగా సారా తయారు చేస్తున్నారు. తయారు చేసిన సారాను పూజారిపుట్ తో పాటు పరిసర గ్రామాల్లో అమ్ముతున్నారు. భర్తలు పనులు చేసేందుకు వెళ్తే, భార్యలు ఇంటి దగ్గర ఉండి మద్యానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం అదే పనిగా తాగడం మొదలుపెట్టారు. కొండగూడ గ్రామంలో ఉన్న మహిళలంతా తాగుడుకు బానిసలయ్యారు. మగవారు కూలి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే మహిళలు మాత్రం వారి కష్టాన్ని మద్యానికి తగలేస్తున్నారు. పైగా భర్తలను మానసికంగా వేధిస్తున్నారు. వారి రసభకు పడలేక భర్తలంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. తమ ఆడోళ్లు మద్యానికి బానిసలై తమను అరిగోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భార్యల తీరుతో తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, ఆబ్కారీ అధికారులతో కలిసి పూజారిపుట్ పంచాయతీ పరిధిలో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. పలువురు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. ఊళ్లోని మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. తాగుడుకు దూరం కావాలని సూచించారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Also: కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మాయి.. రూ.18 కోట్లతో దక్కించుకున్న హాలీవుడ్ నటుడు