రాకేశ్ శర్మ తర్వాత భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఆస్ట్రోనాట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శుభాన్షు శుక్లా. అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్లిన ఆయన సుమారు 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించారు. యాక్సియం -4 మిషన్ ద్వారా కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్ట్లు పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపుతో పాటు శుక్లా అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆక్సియం-4 మిషన్ ను పూర్తి చేసిన తర్వాత మంగళవారం భూమి తిరిగి వచ్చారు.
ఆనంద భాష్పాలతో కుటుంబ సభ్యులకు హగ్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల మిషన్ తర్వాత భూమ్మీదికి చేరిన శుభాన్షు శుక్లా తన భార్య కామ్నా శుక్లా, ఆరేళ్ల కుమారుడు కియాష్ శుక్లాను ప్రేమతో హగ్ చేసుకున్నారు. ఆయన సతీమణి ఈ సందర్భంగా ఆనంద భాష్పాలతో తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు నెలల తర్వాత శుక్లా తన కుటుంబాన్ని చూడటంతో ఎమోషనల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత కామ్నా, కియాష్ ను కలవడం సంతోషంగా ఉందని శుక్లా చెప్పుకొచ్చాడు. శుభాన్షు అంతరిక్షంలోకి వెళ్లి రావడం తమకు ఓ పండుగలా ఉందని కామ్నా వెల్లడించింది. “అంతరిక్షంలో ఉన్న సమయంలో హోం ఫుడ్ ఎంతగా కోల్పోయాడో నాకు తెలుసు. అందుకే, అతడికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేశాను” అని చెప్పుకొచ్చింది.
ఆ ఫోన్ కాల్స్ ఎంతో ప్రత్యేకమైనవి
ISSకు డాకింగ్ అయిన వెంటనే శుభాన్షు నుంచి కాల్ రావడం ఎంతో సంతోషంగా ఉందని కామ్నాచెప్పింది. “డాకింగ్ అయిన వెంటనే కాల్ రావడం ఎంతో అద్భుతం అనిపించింది. అతని గొంతు వినగానే ఎంతో సంతోషం కలిగింది. రోజూ మా ఫోక్ కాల్స్ కొనసాగేవి. మా సంభాషణలు రోజువారీ కార్యకలాపాలు, అతడు చేస్తున్న ప్రయోగాలు, అతడు ఎదుర్కొన్న అసాధారణ అనుభవాల గురించి ఉండేవి. అవి భూమిపై జీవితానికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ 18 రోజుల ఫోన్ కాల్స్ నా జీవితంలో హైలెట్ గా చెప్పుకోవచ్చు” అని వెల్లడించింది. 3వ తరగతి నుంచి ఒకరికొకరు తెలుసన్న కామ్నా, 2009లో పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఇద్దరూ లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్ లో చదువుకున్నట్లు వివరించింది.
22 గంటల ప్రయాణం తర్వాత భూమ్మీదికి..
శుక్లా, కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్ట్లు స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు, ఆక్సియం-4 మిషన్ను పూర్తి చేసి మంగళవారం భూమిపైకి దిగారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో 22 గంటల ప్రయాణం తర్వాత వారు భూమికి తిరిగి వచ్చారు. సోవియట్ రష్యన్ మిషన్ లో భాగంగా రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా శుక్లా గుర్తింపు తెచ్చుకున్నాడు. ISS కి 18 రోజులు ప్రయాణించిన మొదటి భారతీయుడు కూడా ఆయనే. ఇక 2027లో ఇస్రో చేపట్టే గగన్ యాన్ మిషన్ కు శుభాన్షు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
Read Also: సమోసా ఇండియాలో పుట్టిందని అనుకుంటున్నారా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి!