పిల్లల విషయంలో అతిగారాబం ఎప్పటికైనా చెడే చేస్తుందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. పిల్లలను చిన్నప్పుడు ఎలా మలిచితే, పెద్దయ్యాక అలా తయారవుతారని చెప్పారు. చిన్నప్పుడే క్రమశిక్షణ తప్పితే.. పెద్దయ్యాక పరిధిదాటే అవకాశం ఉందన్నారు. తాజాగా నిండా ఐదు సంవత్సరాలు లేని ఓ బాబు చేత వాళ్ల తల్లిదండ్రులు ఏకంగా మోడిఫై చేసిన జీప్ ను నడిపించడాన్నిఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గారాబం పనికి రాదు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ.. ఏం నేర్పిస్తున్నారు? జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు?” అంటూ నిలదీశారు. తల్లింద్రుడుల చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గరాబం పనికి రాదు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ.. ఏం నేర్పిస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు. pic.twitter.com/OUSf6nY7OV
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 12, 2025
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించకూడదని చెప్పుకొచ్చారు. పోలీసులు వెంటనే సదరు తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. “అతి గారాబం కాదు సార్.. తమకు డబ్బు ఉంది అనే బలుపు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి, జైలుకు పంపించాలి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనా, మిగతా వారికి భయం ఏర్పడుతుంది” అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “సీజ్ ద జీప్” అంటూ ఓ నెటిజన్ పవన్ కల్యాణ్ ఫోటో పెట్టి కామెంట్ చేశాడు. “సమాజంలో చెడు ఎక్కువ కావడానికి అసలు కారణం తల్లిదండ్రులు. ఈ విషయం తెలియక చాలా మంది పిల్లలను తిడుతుంటారు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ పోరాటం
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ పేరుతో కొంత మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, అమాయకుల ప్రాణాలు తీయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ సహా పలువురు సినీ, టీవీ ప్రముఖులపైనా ఆయన వరుస ట్వీట్లు చేశారు. సజ్జనార్ ఎంట్రీ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు, విచారణలు అంటూ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పలువురు దేశాన్ని విడిచి వెళ్లడం సంచలనం కలిగించింది. పలువురు యాక్టర్లు, యాంకర్లు పోలీసుల విచారణకు హాజరయ్యారు కూడా. అటు సజ్జనార్ బాటలోనే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై నిప్పులు చెరుగుతున్నాడు. ఎవరు ఎలా? ఈ యాప్స్ ను ప్రమోట్ చేశారు. ఒక్కొక్కరు ఈ యాప్స్ ప్రమోషన్స్ తో ఎంత సంపాదించారు? అనే విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు చాలా మంది వణికిపోతున్నారు.
Read Also: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా.. అసలు విషయం చెప్పిన చిట్టి పికెల్స్ రమ్య!