Visakhapatnam: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. విశాఖపట్నం తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరుగు ప్రయాణంలో గల్లంతవ్వడం తీరప్రాంత గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపుతోంది.
ఆశగా వెళ్లారు.. ఆందోళన మిగిల్చారు
ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే, సముద్రంలో వాతావరణం వేగంగా మారిపోవడం, అలల ఉద్ధృతి పెరగడంతో తీరంలో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు వారిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. శనివారం మధ్యాహ్నానికల్లా క్షేమంగా హార్బర్కు చేరుకుంటామని బోటులో ఉన్నవారు ధీమా వ్యక్తం చేశారు. కానీ, సమయం దాటి రాత్రి అవుతున్నా బోటు తీరానికి చేరకపోవడంతో కుటుంబ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
పనిచేయని ఫోన్లు..
ప్రస్తుతం గల్లంతైన మత్స్యకారుల మొబైల్ ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అసలు వారు ఎక్కడున్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారనేది తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ బోటులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడుతో పాటు భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. ఒకేసారి గ్రామానికి చెందిన పలువురు సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆయా గ్రామాల్లో ఉత్కంఠ, భయాందోళనలు నెలకొన్నాయి.
రంగంలోకి మత్స్యశాఖ..
మత్స్యకారులు గల్లంతైన సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సముద్రంలో అలల వేగం ఎక్కువగా ఉన్నప్పటికీ, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కోస్ట్ గార్డ్ సహాయంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోటును ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని, ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టి వారిని ఒడ్డుకు చేర్చాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి.
Also Read: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కారు ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!