Pawan Kalyan latest speech(AP elections news): సీఎం జగన్ కూటమిని ఎంత దెబ్బతీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తే తాము అంత బలపడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి మధ్య గొడవలు పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అవి ఫలించబోవని వెల్లడించారు. సీఎం జగన్ భయపడేలా కూటమికి మెజారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు కోరారు.
కృష్ణా జిల్లాలోని పెడనలో నిర్వహించిన జనసేన-టీడీపీ ఉమ్మడి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి సభ్యులందరూ రాజ్యాంగాన్ని నమ్మిన వారేనని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కూటమి సభ్యులు ఎన్ని సవాళ్లైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
మత్య్సకారుల పొట్టను కొట్టేందుకే జగన్ జీవో 217ను తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో యువత ఉద్యోగాలు, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ గురించి తెలుకుని యువత.. కూటమికి మరో అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సీఎంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో అనుభవం ఉన్న బలమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమం అనేవి సాధ్యం అవుతాయని స్పష్టం చేశారు. తామంతా కలిసి కూటమిగా ఏర్పడింది.. పదవుల కోసం కాదని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఓ సారా వ్యాపారిగా మారారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.