CM Chandrababu : పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుందని, అందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్షిప్గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు.
వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మార్గదర్శి- బంగారు కుటుంబం నినాదంతో పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, డీబీవీ స్వామి, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రాబోయే ఐదేళ్లలో జీరో పావర్టీ సాధించడమే టార్గెట్ అని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరనీ పేదరికం నుంచి కాపాడగలిగినప్పుడే తన జన్మ సార్దకం అయినట్లన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకోసం శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. దేశంలో కొంత మంది దగ్గరే సంపద పేరుకుపోయిందని దాన్ని పేదవారికి పంచాలని సూచించారు. ఇందులో భాగంగానే P4 పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
ప్రతి కుటుంబం పావర్టీ నుంచి మెరుగైన ప్రమాణాలకు అక్కడి నుంచి ఉన్నత ప్రమాణాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు హార్డ్వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరమని చెప్పారు. సమాజంలో మార్పులకు యువత కారకులు కావాలన్నారు సీఎం చంద్రబాబు. మనంపైకి వచ్చాక తోటివారినీ పైకి తీసుకురావాలన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తృప్తి మరో పనిలో రాదన్నారు. తప్పకుండా పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తా అన్నారు. గాడితప్పిన పాలనను సరైన దిశలో నడిపిస్తున్నాం అన్నారు. తప్పకుండా పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: వైసీపీ స్పెషల్ పంచాంగం.. నాలుగేళ్లు కళ్లు మూసుకుంటే
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం ఏప్రిల్ 1న లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు సీఎం. తొలుత వృద్ధులు, ఒంటరి మహిళ, దివ్యాంగులైన లబ్ధిదారులతో మాట్లాడి వారికి పింఛన్ పంపిణీ చేయనున్నారు. పెన్షన్ పంపిణీ అనంతరం ప్రజావేదిక ద్వారా ప్రజలనుద్దేశించి సభలో సీఎం ప్రసంగించనున్నారు. సభ పూర్తి కాగానే ఒక గంట పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు.
ఒకటో తేదీన పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం నిన్ననే బ్యాంకుల్లో నగదు జమ చేసింది. నేడు ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు కారణంగా పెన్షన్దారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నగదు జమ చేశారు ఏపీ ప్రభుత్వాధికారులు.