ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రతను పెంపొందించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా జరిగిన ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక ‘స్వచ్ఛ రథం’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రథాలు వారానికోసారి గ్రామ సందర్శన చేస్తాయి. ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోయిన పనికిరాని వస్తువులను ఈ రథాలకు అందజేయవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం వారికి నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తుంది. చెత్త నిర్వహణను ప్రజల భాగస్వామ్యంతో ఒక ఉద్యమంగా మార్చాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం వివరించారు. వచ్చే నెల ఆఖరు నాటికి అన్ని పంచాయతీల్లో నూటికి నూరు శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్చి 31వ తేదీ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే అమలవుతున్న ఈ విధానాన్ని పల్లెల్లోనూ పకడ్బందీగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని ఆరోపించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు నగరాల్లో రూ.1,254 కోట్లతో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లను మార్చి 15 నాటికి వినియోగంలోకి తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనివల్ల నగరాల్లో చెత్త సమస్య తీరడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది. వినుకొండ పర్యటనలో భాగంగా సీఎం దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా చెత్త నిల్వలు కనిపించకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక వాహనాలను పెంచడమే కాకుండా.. పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ వినూత్న మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.