AP Elections (Andhra news updates): ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. వైసీపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి మురళి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తొలి రోజే చేబ్రోలు మండలంలో వాలంటీర్లతో అంబటి మురళి ఆత్మీయ సమావేశం నిర్వహించడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణకు ఈసీ ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో 37 మంది వాలంటీర్లు పాల్గొన్నారని నిర్ధారించారు.
పెదకాకాని మండల వెనిగండ్లలో వైసీపీ అభ్యర్థి మరో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు కూడా 8 మంది వాలంటీర్లు హాజరయ్యారు. వారు తక్కెళ్లపాడు, వెనిగండ్ల, పెదకాకాని గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మొత్తం 45 మంది వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని అధికారులు తేల్చారు. దీంతో వారిని విధుల తొలిగిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాస్ డైలాగ్.. ఈసీ రియాక్షన్..
వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరఫున పని చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో ప్రత్యేకంగా పని చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.