AP Fiber Net: ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధికారులు సహకరించలేదా? చాలామంది అధికారులకు వైసీపీతో లింకులు ఉన్నాయా? పాత పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నారా? చివరకు మంత్రులు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? కూటమి పెట్టిన కేసుల నుంచి వైసీపీ నేతలను తప్పించేందుకు ఎత్తుగడ వేశారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి.
ఏపీలో ఏం జరుగుతోంది?
గడిచిన ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఎందుకు కీలక నేతలు అలా చెబుతున్నారో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లకు అర్థమవుతోంది. ఈ క్రమంలో అధికారులపై మండిపడుతున్న సందర్భాలు తరచూ రోజురోజుకూ కనిపిస్తున్నాయి.
పోలీసులు సరిగా రియాక్ట్ కాలేదని తొలుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత తిరుమల తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ సమయంలో ఈవో-ఛైర్మన్ మధ్య కాసింత మాటల యుద్ధం జరిగింది. మొన్నటికి మొన్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్కు తెలియకుండా విశాఖలో రుషికొండ ప్యాలెస్ కట్టించిన గుత్తేదారులకు నిధులు కేటాయించారు అధికారులు. దీనిపై మంత్రి కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికి సంబంధించి నిధులు విడుదల చేశారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఒక్కో శాఖలో బయటపడుతున్న నిజాలు
ఈ విషయం జరిగి రెండు రోజుల తర్వాత ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవి రెడ్డి వంతైంది. ఏకంగా మీడియా సమావేశంలో అధికారులపై రుసరుసలాడారు. తమ సంస్థ అధికారుల్లో బద్ధకం కనిపిస్తోందన్నారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా కోట్లాది రూపాయలు పెనాల్టీ పడేలా చేశారని మండిపడ్డారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు.
ALSO READ: వివేకా పీఏ ఫిర్యాదుపై నివేదిక.. న్యాయస్థానం తీర్పు ఎటు
ఫైబర్ నెట్ బిజినెస్ చేయకపోగా ఉన్న దాన్ని నాశనం చేసే పనిలో నిమగ్నమయ్యారు శివాలెత్తారాయన. ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ, మిగతా అధికారులపై సీఐడీ విచారణ కోరతానని మనసులోని మాట బయటపెట్టేశారు.
ఏపీ ఫైబర్నెట్ సంస్థ ఎండీ దినేష్కుమార్తోపాటు కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు జీవీరెడ్డి. ఈ సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వీటిని అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానన్నారు. గురువారం సాయంత్రం విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. ఛైర్మన్గా తాను చేపట్టిన సంస్కరణల వల్ల ఆదాయం పెరగలేదన్నారు. అలాగని కొత్త కనెక్షన్లు మంజూరు చేసిన సందర్భం కనిపించలేదన్నారు. సంస్థ ఎండీ దినేష్కుమార్ వీటిపై సమీక్ష జరిపలేదన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలోని యాజమాన్యంతో చేతులు కలిపి ఫైబర్ నెట్ సంస్థను చంపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు జీవీరెడ్డి.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఇదివరకు ఆదేశించినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. విచారణ అధికారులకు సహకరించాలని సిబ్బందికి ఎండీ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. బుక్స్ ఆఫ్ ఎకౌంట్స్ చూపాలని ఛైర్మన్ హోదాలో అడిగినా అధికారుల్లో ఏమాత్రం స్పందన లేదన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికీ ఆడిట్ చేయించలేదని, గతంలో జరిగిన అక్రమాలు తెలుస్తాయనే ఇలా చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం వ్యవహారశైలి వల్ల వార్షిక ఆదాయం రూ.2 వేల కోట్ల నుంచి గత ఏడాదికి రూ.200 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంకా ఎంతకు దిగజారుస్తారోనన్న ఆందోళన ఉందన్నారు.
గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబరులో నిర్ణయించినట్లు జీవీ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికీ వారిని తొలగించలేదన్నారు. రెండునెలలుగా వారికి కోట్లలో జీతాలు చెల్లించారని తెలిపారు. మొత్తానికి ఒక్కో ప్రభుత్వ శాఖ అధికారుల గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అధికారుల నిర్లక్ష్య వ్యవహారం ఇంకెన్ని శాఖలకు విస్తరించిందో చూడాలి.