Ganja Crackdown: గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కాస్తా, ‘గంజాయి ఆంధ్రప్రదేశ్’గా మారిందని ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేశారు. ఒకప్పుడు గంజాయికి కేరాఫ్గా మారిన ఉత్తరాంధ్రాను నేడు ప్రగతి పథంలో నడిపిస్తున్నామని ఆమె వివరించారు.
గంజాయిపై ఉక్కుపాదం
మత్తు దందాకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రత్యేక ‘ఈగల్ కమిటీలు’, 5 నగరాల్లో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేశామని శ్రీదేవి తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 9,500 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశామని, 17 మంది స్మగ్లర్ల రూ.10.5 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసి వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టామని చెప్పారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 858 గంజాయి హాట్ స్పాట్స్ను గుర్తించి, 850 ప్రాంతాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు. డ్రోన్ల సహాయంతో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నామని, ‘ఆపరేషన్ చైతన్యం’ ద్వారా అల్లూరి జిల్లాలో 40 వేల ఎకరాల్లో గంజాయి సాగుకు స్వస్తి పలికి, జీరో కల్టివేషన్ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: నలుగురు పిల్లల తల్లి కోసం టవరెక్కిన ప్రేమికుడు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!
గిరిజనులకు ప్రత్యామ్నాయం – విద్యార్థులకు రక్షణ
గంజాయికి ప్రత్యామ్నాయంగా గిరిజనులకు సీతాఫలం, జీడిమామిడి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి 4 లక్షల మొక్కలను పంపిణీ చేయడంతో పాటు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. ‘ఈగల్ ట్రైన్స్’ ద్వారా ఒడిస్సా రైళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, ‘ఆపరేషన్ గరుడ’ ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మే మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తున్నామని హెచ్చరించారు. విద్యార్థుల రక్షణ కోసం 5,000 విద్యాసంస్థల్లో 40 వేలకు పైగా ‘ఈగల్ క్లబ్స్’ ఏర్పాటు చేసి, ‘సేఫ్ క్యాంపస్ జోన్’లను క్రియేట్ చేశామన్నారు. మత్తుకు బానిసైన వారి కోసం 56 డీ-అడిక్షన్ సెంటర్లు, 3 వరల్డ్ క్లాస్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1972, వాట్సాప్ నెంబర్ 8977781972 అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
ఉత్తరాంధ్రాకు ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల వరద
గత పాలకులు రుషికొండను బోడిగుండు కొట్టి రూ. 500 కోట్లు వృధా చేసి ఐటీ కంపెనీలను వెళ్లగొడితే.. నేడు సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఒక్క ఉత్తరాంధ్రాకే కేటాయించామని శ్రీదేవి సగర్వంగా ప్రకటించారు. వైజాగ్ ఐటీ హబ్ కోసం గూగుల్ డేటా సెంటర్ ద్వారా రూ. 1,35,000 కోట్లు, రిలయన్స్ డేటా సెంటర్ ద్వారా రూ. 1 లక్ష కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ద్వారా రూ. 1,36,000 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. విశాఖలో టీసీఎస్ (TCS) ద్వారా రూ. 1,370 కోట్ల పెట్టుబడితో పాటు, ఫ్రాంక్లిన్ టెంపుల్, బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రాలుగా వైజాగ్ మారుతోందని, గతంలో వెళ్ళిపోయిన 26 ప్రముఖ కంపెనీలు తిరిగి వచ్చాయని పేర్కొన్నారు.
మౌలిక వసతుల కల్పన – ప్రగతి పథం
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం నుండి రూ. 11,450 కోట్లు సాధించామని, ఈ ఏడాది మరో రూ. 8,000 కోట్లకు లైన్ క్లియర్ అయిందని శ్రీదేవి వెల్లడించారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సాధించడంతో పాటు, ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 960 కోట్లు కేటాయించామని చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ నింపేందుకు ప్రత్యేక జీవో ఇచ్చామని, రికార్డు స్థాయిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చీపురుపల్లి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రాను.. ‘పుడితే ఉత్తరాంధ్రాలోనే పుట్టాలి’ అనే రేంజ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!