Ambati Rambabu: వైసీపీ నేతలు పీకల్లోతుల్లో మునిగిపోయారా? జగన్ హయాంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారా? చాలామందిపై కేసులు వెంటాడుతున్నాయి. రేపో మాపో రోజా వంతు కానుంది. తాజాగా రేసులో మరో ఫైర్బ్రాండ్ నేత వచ్చారు. ఆయనెవరోకాదు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏంటి ఆయన చేసిన అవినీతి, కాసింత లోతుల్లోకి వెళ్లే..
వైసీపీ ఫైర్ బ్రాండ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేవారిలో అంబటి రాంబాబు ఒకరు. ఆయన తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో ఆయనకు ఎదురులేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతుంటారు. అలాంటి అంబటికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. వైసీపీ రూలింగ్లో ఆయన చేసిన ఘనకార్యాలపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అంబటి రాంబాబు భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు గుప్పమన్నాయి. ఆ ప్రభుత్వం హయాంలో దాదాపు రూ. 10 కోట్ల స్వాహా చేసినట్టు ప్రధాన పాయింట్. జగనన్న కాలనీల కోసం కోనుగోలు చేసిన భూముల అక్రమాలు కీలకమైంది. ఎకరా రూ. 10 లక్షల చొప్పున కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ. 30 లక్షలకు అమ్మినట్టు తెలుస్తోంది.
ఆ విధంగా వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ఇదే పాలసీని కంటిన్యూ చేశారట. ఇక రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్కు ఎకరాకు 5 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురాయి వ్యాపారుల నుంచి ఐదేళ్లలో రూ.10 కోట్లు పిండి వసూలు చేసినట్టు మరో పాయింట్.
ALSO READ: ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు, టెన్షన్ లో వైసీపీ నేతలు
విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు రూ.7 లక్షలకు అమ్మకాలు చేశారన్నది మరో ఆరోపణ. వీటన్నింటిపై విజిలెన్స్కు ఫిర్యాదుల వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. అంబటి అవినీతి ఆరోపణలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్కు ప్రభుత్వం ఆదేశాలు చేసింది.
నివేదికలో అక్రమాలు జరిగినట్టు తేలితే అంబటి రాంబాబుకు చిక్కులు తప్పవని అంటున్నారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నారు. మరి ఈ కేసు పరిస్థితి బట్టి ఏసీబీకి ఇస్తుందా? లేకుంటే సిట్ వేస్తుందా అనేది నెలరోజుల్లో తేలిపోనుంది.
రియల్ ఎస్టేట్ మొదలు.. ఉద్యోగుల బదిలీలు, కోడి పందేలు-పేకాట శిబిరాల వరకు ప్రతి విషయంలో ఆయన వసూళ్ల పర్వం నడిచిందట. సత్తెనపల్లిలో బార్-రెస్టారెంట్లలో వ్యాపారులకు సిండికేట్గా మారారట. వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 33 శాతం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారుల బదిలీల కోసం గుంటూరులో ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు తెరలేపినట్టు చెబుతున్నారు. మట్టి తవ్వకాల గురించి చెప్పనక్కర్లేదు. కోట్లాది రూపాయలు చేతులు మారాయని అంటున్నారు.