AP Govt : ఏళ్లుగా పేరుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నుంచి పెండింగ్ లో పడిపోయిన జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల విడుదల కోసం ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం స్పందించింది. తక్షణమే.. ఉద్యోగులకు అందాల్సిన బకాయిలను జమ చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారికి అందాల్సిన నిధులన్నింటినీ విడుదల వారీగా అందించాల్సింగా సూచించారు. దాంతో.. ఉద్యోగులు పాత బకాయిలు చెల్లించేందుకు ఏపీ ఆర్థిక శాఖ రూ.6,200 కోట్లను విడుదల చేసింది. దీంతో.. ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం ఉదయం నుంచి సొమ్ములు జమవుతున్నాయి.
తమకు రావాల్సిన బకాయిలపై ఏపీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు అనేక మార్లు ప్రభుత్వానికి నివేదించారు. సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి బాకాయిలు చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో.. వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేసిన ఏపీ సీఎం.. ఇప్పటి వరకు రూ.6.2 వేల కోట్లను సరిపెట్టారు. ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండగా.. మరో ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిధుల జమ పూర్తవుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. బకాయి నిధుల జమ విషయమై ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలిపారు.
రూ.25 వేల కోట్ల బకాయిలు
రాష్ట్ర బడ్జెట్ ను పూర్తిగా సంక్షేమానికే ఖర్చు చేసిన గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ ఖజానాకు విపరీతమైన నష్టం వాటిల్లిందంటూ ఇప్పటి అధికార పక్ష నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర గల్లాపెట్టెను పూర్తిగా పంపకాలకే సరిపెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగానే.. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన బకాయిలు రూ.25 వేల కోట్లకు చేరాయి. నెలనెలా ఈ బకాయిలు మరింతగా పెరిగిపోతుండగా.. రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సైతం అదే తీరుగా భారీగా పెరిగిపోతున్నాయి.
ఈ నిధుల విషయమై అనేక సార్లు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లోని బకాయిల అందజేతపై దృష్టి పెట్టింది. విడతల వారీగా ఉద్యోగులకు రావాల్సిన చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపట్టింది. అలా.. ఈ ఏడాది జనవరిలో వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లను ఏపీ సర్కార్ విడుదల చేయగా.. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లను ఉద్యోగులకు అందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read : Lady Aghori: అఘోరీ శ్రీవర్షిణి ఎక్కడ..? లేడీ అఘోరీపై పీఎస్లో ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం నుంచి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతుండడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే మిగతా సొమ్ముల్ని కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం సైతం ఈ విషయం లో సానుకూలంగా ఉండడంతో త్వరలోనే పూర్తి స్థాయిలో బకాయిల చెల్లింపులు పూర్తవుతాయని భావిస్తున్నారు.