Bhemili Beach :
⦿ భీమిలీ బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా గోడ
⦿ విజయసాయి కుమార్తె కంపెనీ నుంచి రాబట్టాలి
⦿ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కీలక ఆదేశాలు
⦿ పునాదిని వదిలేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణల మధ్య విశాఖపట్నంలోని భీమిలి బీచ్ దగ్గర అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. భీమిలి బీచ్ సమీపంలో వైసీపీ మాజీ నేత, అప్పటి రాజ్యసభ సభ్యుడైన విజయ సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా.. నిర్మాణాలు చేపట్టారని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేహా వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన హైకోర్టు.. ఇలాంటి విషయాల్లో కఠినంగానే వ్యవహరించాలని సూచించింది. ఈ విషయమై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత అధికారిని హైకోర్టు ధర్మాసం ఆదేశించింది. ఈ గోడ నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు, నిరసనలు రావడంతో.. గోడ వరకు కూల్చేసి, పునాదిని అలాగే వదిలేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్మాణం.. ఇసుక కింద 588 మీటర్ల పొడవున, ఆరు అడుగుల లోతున్న బలంగా నిర్మించారని, దీన్ని అలాగే ఎందుకు వదిలేశారని మున్సిపల్ శాఖను ప్రశ్నించింది. ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటుగా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి, ఆమె భాగస్వామిగా ఉన్న సంస్థల నుంచి ప్రహరీ నిర్మాణాన్ని కూల్చడం, తొలగించేందుకు అయిన మొత్తాన్ని రాబట్టాలని ఆదేశించింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని సైతం వారి నుంచి వసూలు చేయాలని సూచించింది.
నివేదిక ఇవ్వండి..
మరోవైపు భీమిలి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెస్టోబార్లపైనా దాఖలైన పిటిషన్లపైనా విచారణ చేపట్టింది. ఈ కేసులో సమగ్ర సర్వేచేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది. కాగా, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్రెడ్డి, కుమార్తె నేహారెడ్డి భాగస్వామ్యంగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ భీమిలి-భోగాపురం బీచ్ రోడ్డులో విలువైన స్థలాలు కొనుగోలు చేసింది. మొదట కొందరు బినామీల పేరుతో స్థలాలు కొనుగోలు చేసి, ఆ తర్వాత అవ్యాన్ రియల్టర్స్ పేరుపైకి బదలాయించారు. అయితే కొంత స్థలాన్ని ఆక్రమించి సీఆర్జెడ్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు దర్జాగా తెర తీయడంతో దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.
Also Read : Nara Lokesh: 11వ బ్లాక్ ఎదురుచూస్తోంది.. జగన్ అసెంబ్లీకి రావచ్చు.. లోకేష్ సెటైర్స్
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను ఉల్లంఘించారంటూ తొలుత స్థానికులు ఆందోళనకు దిగగా.. ఈ నిర్మాణాలపై ఫిర్యాధులు అందడంతో జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్) అధికారులను చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మేరకు, జీవీఎంసీ అధికారులు 2024 సెప్టెంబర్ 4న నేహారెడ్డి నిర్మించిన అక్రమ ప్రహరీ గోడను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. కూల్చివేతలపై నేహా రెడ్డి స్టేటస్ కో ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. దాంతో.. కూల్చివేతలు ముందుకు సాగాయి. ఈ చర్యల పురోగతిపై తాజాగా విచారణ చేపట్టి.. పరిహారాన్ని నిందితుల నుంచే వసులూ చేయాలని ఆదేశించింది.