AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. ఈ దశలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లను విద్యార్థులు స్వయంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానుండగా, మార్చి 20వ తేదీన ముగియనున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 19వ తేదీన ముగియనుండగా, సెకండ్ ఇయర్ పరీక్షలు 20వ తేదీన ముగుస్తాయి. ఈ నేపథ్యంలో 10 రోజులు ముందుగానే ఏపీ ప్రభుత్వం విద్యార్థులు హాల్ టికెట్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు ప్రారంభించిన ప్రభుత్వం, ఇంటర్ విద్యార్థులకు వాట్సప్ సేవలతోనే హాల్ టికెట్లను అందుకునే అవకాశాన్ని కల్పించింది.
అందుకోసం విద్యార్థులు 95523 00009 వాట్సప్ ఛానల్ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యాసేవలను ఎంచుకొని, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల విభాగంలో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ అడిగిన విద్యార్థి సమాచారాన్ని పూర్తిగా నమోదు చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం కల్పించింది.
అంతేకాకుండా ఏపీ ఇంటర్ హాల్ టికెట్లను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bie ap.gov.in ద్వారా కూడా పొందే అవకాశాన్ని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిందని చెప్పవచ్చు. విద్యార్థులు వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసిన వెంటనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పలు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లను అందించేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా విద్యార్థుల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అమలు చేయడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. పది పూర్తయిన అనంతరం ఇంటర్ లో చేరే విద్యార్థుల శాతం తగ్గుతున్న క్రమంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలకు సైతం శ్రీకారం చుట్టింది.
Also Read: పుచ్చకాయ కొనుగోలు చేస్తున్నారా? ఇలా చెక్ చేయకుంటే పెను ప్రమాదమే?
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత కేంద్రాల సూపరిడెంట్ లకు ఆదేశాలు వెలువడ్డాయి. ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య శిబిరం, త్రాగు నీటి సౌకర్యం, ఇలా మౌలిక సదుపాయాలను పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కల్పించనున్నారు. ఇంటర్ హాల్ టికెట్లను విడుదల చేసిన ప్రభుత్వం విద్యార్థులకు ముందస్తుగా ఆల్ ది బెస్ట్ అంటూ.. ప్రతి విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించేలా కృషి చేయాలని సూచించింది.