Bosta vs Anagani satya prasad: మదనపల్లె ప్రభుత్వ దస్త్రాల దహనం అంశం శాసనమండలిని కుదిపేసింది. ఈ కేసులో ఎలాంటివారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
మంగళవారం సభలో మదనపల్లె దస్త్రాల ఘటనకు సంబంధించి టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మాట్లాడిన రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించారు. వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం చోటు చేసుకుంది.
విచారణ జరుగుతున్న సమయంలో వ్యక్తుల పేర్లు ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభ్యులపై బురద జల్లడం సరికాదన్నారు. రికార్డుల నుంచి ప్రకటించిన వ్యక్తుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈలోగా ఛైర్మన్ జోక్యం చేసుకుని సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. వ్యక్తుల పేర్లు వెల్లడించకుండా మాట్లాడాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ నోరు విప్పారు. సీఐడీ దర్యాప్తులో ఉన్న అంశాలను తాను ప్రస్తావించానని అన్నారు. మొత్తం 2,400 ఫైళ్లకు నిప్పు పెట్టారని తెలిపారు.
ALSO READ: పోలీసుల విచారణకు ఆర్జీవీ డుమ్మా.. ఫోన్ ద్వారా సమాచారం
ఘటన విషయం తెలియగానే అధికారులు, పోలీసులు అక్కడి వెళ్లారని తెలిపారు మంత్రి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దస్త్రాలు తగలబడినట్టు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవన్నారు. కుట్ర పూరితంగా ఘటన జరిగినట్టు కనిపించిందన్నారు. సీసీటీవీ కెమెరా అప్పుడు పని చేయకపోవడం, మోటారు ఆయిల్ అక్కడ ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది.
ఈ క్రమంలో సీఐడీ దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఘటనలో కొందరి మాజీ అధికారుల పేర్లు ప్రస్తావించారు మంత్రి అనగాని. వీరంతా మాజీ మంత్రి అనుచరులుగా ఉన్నారని వివరించారు. దీనిపై సీఐడీ లోతుగా విచారణ చేస్తోందని, దాన్ని నిర్ధారించాల్సి వుందన్నారు.
మదనపల్లెలో మొత్తం 13, 445 ఎకరాలు ఉండగా, చట్ట ప్రకారం జరిగింది 8,882 ఎకరాలని అన్నారు. చట్ట ప్రకారం కాకుండా 4,500 ఎకరాలని తేల్చి చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సాక్షాలను బూడిద చేశారన్నారు. అందులో నుంచి అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.