AP Pension Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదికి కేవలం రూ.250 చొప్పున పెంచుతూ ఐదేళ్ల పాటు కాలయాపన చేశారని, వికలాంగుల పెన్షన్ను రూ.3,000 నుంచి రూ.6,000కు, డయాలసిస్ రోగులకు రూ.10,000కు పెంపు, మంచానికే పరిమితమైన రోగులకు పెన్షన్ రూ.15,000కు పెంచామని అన్నారు. వలస వెళ్లిన వారి సౌకర్యార్థం ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని మంత్రి కొండపల్లి శ్రినివాస్ తెలిపారు.
లబ్ధిదారుడు చనిపోతే ఏమాత్రం ఆలస్యం లేకుండా భార్యకు వెంటనే స్పౌస్ పెన్షన్ మంజూరు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేశామని అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన మరో 1.09 లక్షల పెన్షన్లను పునరుద్ధరించి అందించాంమని, వైసీపీ హయాంలో ఏడాదికే 10 లక్షల పెన్షన్లు తొలగిస్తే, కూటమి ప్రభుత్వంలో ఒక్కటీ కూడా రద్దు చేయలేదని అన్నారు. 6 లక్షల పెన్షన్లు తొలగించామంటూ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేసారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిబంధనల ప్రకారం తొలగించినవి కేవలం 3 వేలు మాత్రమేనని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రూ.33 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అని అన్నారు.
Also read: సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న కాలభైరవ, కావ్య.. ఫొటో వైరల్!
కొత్త పెన్షన్ల కోసం సచివాలయాల్లో 7 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ, నిన్నటికే 2.30 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని వైసీపీ నేతలు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ సూపర్ సిక్స్ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని నాశనం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టును చక్కదిద్దిందని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు సాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే సరిగ్గా నెరవేర్చని వైసీపీ నేతలు.. నేడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.15,000 పెన్షన్ ఇస్తామని నాడు హామీ ఇచ్చి దాన్ని పూర్తిగా నీరుగార్చారని అన్నారు.
Also read: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం