విజయవాడ ట్రాఫిక్ పోలీస్ శాఖ టెక్నాలజీని వినియోగించడంలో మరో దశలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా నగర ట్రాఫిక్ విభాగానికి ఆధునిక పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన 14 డ్రోన్లు, 350 బ్యాటన్ లైట్లు, 720 పోలీస్ క్యాప్స్ అధికారికంగా అందజేశారు. తర్వాత 40 కొత్త ట్రాఫిక్ పాట్రోల్ వాహనాలకు పచ్చజెండా ఊపి సేవలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ గుప్తా మాట్లాడుతూ, విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ డ్రైవ్స్, శాంతి భద్రతల పరిరక్షణలో అత్యుత్తమంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ట్రాఫిక్ సిబ్బంది ఎండ, వర్షం, కాలుష్యానికి లోనై సమర్పణతో పనిచేస్తున్న తత్వాన్ని గుర్తించి, వారి సేవలను ప్రశంసించాల్సిందే అన్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో టెక్నాలజీ ప్రాముఖ్యత..
విజయవాడ పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని, నేర నిరోధంలో, ట్రాఫిక్ నియంత్రణలో టెక్నాలజీ ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఆయన డ్రోన్ల పనితీరును స్వయంగా తనిఖీ చేశారు. విజయవాడ నగరం ఇప్పటికే “ఆస్ట్రామ్” అనే ఎఆర్ ఆధారిత వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించిందని, విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాన్ని వినియోగించారని వివరించారు. ఈ విజయవంతమైన మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ స్పష్టం చేశారు.
విజయవాడ తరహా ఇతర నగరాల్లోనూ త్వరలో..
ప్రతి పోలీస్ స్టేషన్లో కనీసం ఒక డ్రోన్ ఉండేలా చర్యలు తీసుకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో వీటిని నిఘా, రక్షణకోసం వినియోగిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. సీసీటీవీలు, డ్రోన్లు, ఇతర ఆధునిక పరికరాలను విరాళంగా అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరగాళ్లను వేగంగా గుర్తించగలుగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖకు సంబంధించిన దృక్పథం మారిందని, ప్రజల భద్రతకు టెక్నాలజీ సహకారంతో మరింత సమర్ధవంతంగా స్పందించగలుగుతున్నామని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ తరహా మోడల్ను రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ త్వరలో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.