ఈ నెలాఖరులో ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. మోదీ రాకను కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలనుకుంటోంది. ఆ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ మోదీ సెంటిమెంట్ ని వైరి వర్గం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మోదీ రాకపై సెటైర్లు పేల్చారు. అమరావతికి ఒకసారి వచ్చి మట్టికొట్టిపోయిన మోదీ, రెండోసారి వచ్చి సున్నం కొట్టిపోతారేమో అని కౌంటర్లిచ్చారామె. వాస్తవంగా మోదీ రాకపై ఏపీలోని ప్రతిపక్షం వైసీపీ సెటైర్లు వేయాలి. కానీ బీజేపీని తిట్టేంత ధైర్యం వైసీపీ చేయదు కదా. అందుకే ఆ బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంది. మోదీపై మొహమాటం లేకుండా సెటైర్లు పేల్చారు షర్మిల.
పంచ్ లు వేయడం లో అక్క స్టైలే వేరు.. మాస్ ఉంటాయి 😂😂😂😂 pic.twitter.com/NbYnQL5teO
— Nani (@Ravanaroy) April 10, 2025
అప్పుడు ఏం జరిగింది..?
2014లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు ప్రకటిస్తారని అనుకుంటే, మోదీ మాత్రం పుణ్య స్థలాలనుంచి తీసుకొచ్చిన మట్టిని, వివిధ నదుల నుంచి తెచ్చిన నీటిని సమర్పించి వెళ్లారు. రాజధానికి మోదీ ఏమిచ్చారంటే గంపెడు మట్టి, బిందెడు నీళ్లు.. అంటూ అప్పట్లో జోకులు పేలాయి. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండోసారి మోదీని పిలుస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి ఆయన్ని ఆహ్వానించామంటున్నారు. ఈసారి మోదీ ఏమి తీసుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పుడు మోదీ ఏం తెస్తారు..?
తాజాగా మోదీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి అండగా నిలబడతామంటోంది. అమరావతికోసం ఆల్రడీ 15వేల కోట్ల రూపాయలు ప్రకటించింది. అమరావతిని దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ గా మార్చేందుకు కూడా ఇటీవల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏపీలో రైల్వేల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. ఇవి కాకుండా కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిలబెడుతున్న టీడీపీ, జనసేనకు.. ఆ పార్టీల కూటమి అధికారంలో ఉన్న ఏపీకి ప్రత్యేకంగా ప్రధాని మోదీ ఏమైనా వరాలు ప్రకటిస్తారేమో చూడాలి.
టీడీపీ ఏం ఆశిస్తోంది..?
టీడీపీ కూడా కేంద్రం నుంచి కాస్త గట్టిగానే సహాయం ఆశిస్తోంది. అప్పట్లో అమరావతిలో అరకొర నిర్మాణాలతో ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడ్డారు. ఈసారయినా అమరావతిని పూర్తి చేసి, వచ్చే ఎన్నికలనాటికి తమ సత్తా చూపించి ఓట్లు అడగాలని భావిస్తున్నారు నేతలు. మరి కేంద్రం సహాయం చేస్తుందా, లేక మోదీ మాటలతో సరిపెడతారా అనేది వేచి చూడాలి.
ఏపీ రాజకీయాలపై మోదీ మాట్లాడతారా..?
ఇక ఏపీ రాజకీయా గురించి ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎన్నికలు లేవు కాబట్టి.. కనీసం ప్రతిపక్షం పేరెత్తకుండానే ఆయన నిష్క్రమించే అవకాశం ఉంది. ఏపీలో జగన్ రాజకీయాలను మోదీ ఎలా అంచనా వేస్తారు, కనీసం వైసీపీ అవినీతి, అక్రమాలు.. అనే మాటలయినా ఆయన నోటినుంచి వస్తాయేమో చూడాలి. అప్పట్లో అమరావతికి జగన్ అడ్డుపడ్డ విషయం తెలిసిందే. ఆ వ్యవహారాన్ని ప్రధాని మోదీ పునర్నిర్మాణ సభలో ప్రస్తావిస్తారా లేదా అనేది తెలియదు. ఒకవేళ నిజంగానే మోదీ.. వైసీపీని విమర్శిస్తే, టీడీపీకి అది మరింత బలంగా మారుతుంది. ఆ ఛాన్స్ మోదీ, టీడీపీకి ఇస్తారో లేదో.