YS Sharmila: వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. అందుకుగాను సీఎం జగన్ వారికి క్షమాపణలు చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ పాలనలో బడుగు బలహీనవర్గాల వారి జీవన ప్రమాణాలు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు.
సీఎం జగన్ కు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదని.. అందువలన వారి జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్యాంగం పరంగా వారికి దక్కాల్సిన హక్కులు కూడా దక్కడం లేదని విమర్శించారు.
వారికి కేటాయించాల్సిన నిధులను జగన్ దారి మళ్లించి బడ్జెట్ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని మండిపడ్డారు. వైసీపీ పాలన కారణంగా రాష్ట్రంలో ఐదేళ్లలో వారిపై అనేక దాడులు జరిగాయని వెల్లడించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి వరకు కొనసాగిన 28 పథకాలను జగన్ నిలిపేశారంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాసరే తనకేం పట్టనట్లే జగన్ ఉన్నారని విమర్శించారు. వారిపై దాడులు చేస్తున్న వారిని నిలువరించి.. వారిని కాపాడే ప్రయత్నాలు చేయడం లేదన్నారు.
బడుగు బలహీన వర్గాల వారిపై దాడులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన పెత్తందార్లే ఉన్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఎస్సీలకు జగన్ ప్రభుత్వం మేలు చేయాల్సింది పోయి.. కీడు చేస్తోందంటూ దుయ్యబట్టారు.
Also Read: వైసీపీ పవిత్ర గ్రంథం, రెండు పేజీలు అవసరమా అంటూ..
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి జగన్ క్షమాపణలు చెప్పాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వాలని కోరారు. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ తరఫున తమ డిమాండ్ అంటూ లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.