ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.టీ కృష్ణబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఎండీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ అనంతరం.. ఆర్టీసీ హౌస్లో జరిగిన కార్యక్రమంలో కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ ఆర్థిక స్థితిగతులు, ప్రయాణికుల సేవలు, భవిష్యత్ లక్ష్యాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
పర్యావరణ హిత రవాణా వ్యవస్థే లక్ష్యం..
వచ్చే ఐదేళ్లలో ఏపీఎస్ఆర్టీసీని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు కృష్ణబాబు సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. పీఎం ఈ-బస్ పథకం కింద 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. వీటికి అదనంగా మరో 1,450 ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను దశలవారీగా ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా, కాలుష్య నియంత్రణ, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
స్త్రీ శక్తి పథకానికి భారీ స్పందన
సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆయన ప్రత్యేక సమీక్ష చేశారు. ప్రస్తుతం రోజుకు 23 నుంచి 25 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, ఆర్టీసీ మొత్తం ప్రయాణికుల్లో మహిళలే 65-67 శాతం ఉన్నారని తెలిపారు. దీనివల్ల బస్సుల ఆక్యుపెన్సీ రేటు 90 శాతానికి చేరుకుందని, ఇది సంస్థ ఆర్థిక స్థిరత్వానికి ఎంతగానో తోడ్పడుతోందని పేర్కొన్నారు. ప్రయాణికుల సంతృప్తిపై నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది సానుకూలంగా స్పందించారని, మిగిలిన 20 శాతం ఫిర్యాదులను (ముఖ్యంగా టాయిలెట్లు, తాగునీరు) వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల సంక్షేమం – ఆదాయ వనరులు..
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణబాబు స్పష్టం చేశారు. వైద్య కారణాల రీత్యా అన్ఫిట్గా తేలిన 682 మంది ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా అదనపు ద్రవ్య ప్రయోజనాలు (AMB) కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఆర్టీసీకి ఉన్న ఖాళీ స్థలాల వాణిజ్య వినియోగం మరియు కార్గో సేవల విస్తరణ ద్వారా ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం కార్గో ద్వారా ఏడాదికి రూ. 210 కోట్ల ఆదాయం వస్తుండగా, దాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోడ్ల అభివృద్ధికి రూ. 3,000 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా 10,700 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కృష్ణబాబు వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం రూ. 3,000 కోట్లు కేటాయించిందని, మార్చి నాటికి రూ. 1,000 కోట్లు, జూన్ నాటికి రూ. 1,500 కోట్లు, జూలై నాటికి మిగిలిన రూ. 500 కోట్లు విడుదల చేస్తామన్నారు. సురక్షితమైన ప్రయాణం, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా ఆర్టీసీ యంత్రాంగం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్రహ్మానందరెడ్డి, రవివర్మ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Gadwal Municipality: మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్గీయుల హైడ్రామా..!