Sankranti Special Buses : సంక్రాంతి వచ్చిందంటే తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, ఉపాధి కోసం తరలిపోయిన వారంతా సొంతూర్లకు తిరిగి ప్రయాణం అవుతారు. పల్లెటూర్లులో కావాల్సిన వారి మధ్య ఆనందంగా పండగను జరుపుకుంటారు. ఆ నాలుగు రోజులు స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడిపేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ నుంచి లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్తారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుందంటే అతిశయోక్తి కాదు.. పండక్కి ముందు నుంచే రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు జనాలతో కిక్కిరిసిపోతుంటాయి. అందుకే చాలామంది నెలల ముందు నుంచే రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇలాంటి వారందరికీ APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని సొంతూర్లకు వచ్చే వారి కోసం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. వేల మందికి ఉపయోగపడే ఈ నిర్ణయంతో తెలంగాణలో ఉంటున్న ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగ రోజు తీయనైన కబురు చెప్పారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అచ్చమైన పల్లె పండగైన సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ఏకంగా 2,400 ప్రత్యేక బస్సు సర్వీస్ ని నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేసారు. ఈ నిర్ణయంతో పండక్కి సొంతూర్లకు వెళ్లి అయిన వారి మధ్య గడపాలనుకునే వేలమంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు ఎలా అంటే..
ఈసారి సంక్రాంతికి ప్రత్యేక బస్సులే కాదు.. మరో అదిరిపోయే కానుకని సైతం ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో మాదిరిగా పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక సర్వీసులకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని ప్రకటించింది. సాధారణ రోజుల్లో మాదిరిగానే రెగ్యులర్ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసుల్లో ప్రయాణించవచ్చని ఆఫర్ చేసింది. ప్రతిసారీ పండుగల సమయాల్లో సాధారణం కంటే రెండు రెట్లు, ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మూడు, నాలుగు రెట్లు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తుంటారు. దీంతో.. కుటుంబంతో కలిసి పండక్కి ఊరెళ్లాలంటే జేబు గుల్ల కావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యూలర్ ఛార్జ్ లతోనే ప్రయాణించవచ్చనే ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుత నిర్ణయంతో.. హ్యాపీగా జేబు మీద చేయి వేసుకొని సొంతూర్లకు వెళ్లిపోవచ్చని సంతోషపడుతున్నారు ఏపీ వాసులు. ఎంచక్కా… కుటుంబమంతా కలిసి పండక్కి ఊరెళ్లి పోవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ జిల్లాలకు వెళ్లే బస్సులు కోసం..
రోజువారి తిరిగే సర్వీసులకు అదనంగా మరో 2,400 బస్సులను ఏర్పాటు చేయడంతో.. హైదరాబాద్ నగరంలో రద్దీ భారీగా పెరగనుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం జనవరి 10 నుంచి 12 వరకు బస్సు ప్రయాణ స్థానాలను మార్చింది. హైదరాబాదులోని ఎంజీబీఎస్ లో రద్దీని తగ్గించేందుకు ఈ మార్పు చేర్పులు చేసినట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. కొన్ని జిల్లాలకు వెళ్లే బస్సులకు మరో స్థానం నుంచి ప్రారంభించనుంది. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్ స్పెషల్ బస్సులను ఎంజీబీఎస్ కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ బస్ స్టేషన్ నుంచి మొదలవుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా ఈ విషయాన్ని గమనించి.. ఎలాంటి హడావుడి పడకుండా జాగ్రత్తగా ప్రయాణాలు సాగించాలని కోరారు.
Also Read : నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదు.. పేర్ని నానికి మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..