TG Venkatesh: హీరో చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? జనసేన వైపా? లేక బీజేపీ వైపా? తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని కొద్దిరోజుల కిందట మెగాస్టార్ చెప్పుకొచ్చారు. మళ్లీ అవే వార్తలు రీ సౌండ్ చేయడంపై బీజేపీ నుంచి క్లారిటీ వచ్చింది. అసలేం జరుగుతోంది?
నటుడు చిరంజీవి ఈ మధ్యకాలంలో కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఖాయమంటూ వార్తలు జోరందుకుందన్నాయి. ఇప్పటికే ఏపీలో కూటమి సర్కార్ రూలింగ్లో ఉంది. ఇక తెలంగాణ వంతైంది. ఒకవేళ మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
దీనివెనుక కొందరు బీజేపీ నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారన్నది దాని సారాంశం. దీనిపై నోరు విప్పారు బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చిరంజీవితో మంచి అనుబంధం ఉందన్నారు. అంత మాత్రాన పార్టీలో చేరుతారని ఎలా చెబుతారని ఎదురు ప్రశ్నించారు. చిరంజీవితో స్నేహ పూర్వకంగా పార్టీ ముందుకు వెళ్తుందన్నారు.
ALSO READ: కూటమి సర్కార్ యూ-టర్న్.. ప్రమాదకర సంకేతాలు దేనికి?
కొన్ని నెలలుగా చిరంజీవికి బీజేపీ దగ్గరవుతోంది. ప్రధాని మోదీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో మెగాస్టార్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టాపన కోసం ప్రత్యేకంగా హాజరయ్యారు. అలాగే మూడేళ్ల కిందట నరసాపురంలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరిగాయి. దీనికి చిరు అటెండయ్యారు. అప్పుడు ముఖ్యఅతిధిగా ప్రధాని నరేంద్రమోదీ వచ్చారు.
లేటెస్ట్గా ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి-ప్రధాని మోదీ వీరి కాంబినేషన్ సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ప్రధాని మోదీతో కలిసి చిరంజీవి నడవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో చిరంజీవి రీఎంట్రీ వార్తలు జోరందుకుంది. అలాంటిదేమీ లేదన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్.