Botsa , Sajjala : ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్రంలోని ప్రజల సమస్యలే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. వారికి తీరే కోరికలు ఉంటే మంచిదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స , ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందంటూ ప్రచారం చేయటం సరికాదన్నారు బొత్స . ఉద్యోగులతో చర్చించాకే పీఆర్సీపై ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాల రూపంలో ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఉద్యోగులు కొన్ని అంశాలపై కోర్టులకు వెళ్లటం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకెళితే ఉద్యోగులకే సమస్య అని మంత్రి బొత్స వివరించారు.
సీఎం దృష్టిలో ఉద్యోగులు అందరూ సమానమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దు అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు. సమాజ అభివృద్ధిలో భాగంగానే ఉద్యోగులు ఉండాలన్నారు. తమకు ఉద్యోగుల గ్రూపులు అనవసరమని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సజ్జల సూచించారు.