Chandrababu: గన్నవరం ఘటనలో టీడీపీ నేతలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పార్టీ అధినేత చంద్రబాబు. ఏపీలో ధర్మానికి, అధర్మానికి.. ప్రజాస్వామ్యానికి, నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే అన్నారు. గన్నవరం విధ్వంసంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులతోనే తప్పుడు కేసులు పెట్టించి, తన వికృత రాజకీయానికి జగన్ వారిని పావులుగా వాడుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్టియన్ అయిన గన్నవరం సీఐ కనకారావుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా.. ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ధి స్కామ్లో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ప్రధాన నిందితుడని చంద్రబాబు ఆరోపించారు.
గన్నవరం ఘటనలో బాధితులైన తెలుగుదేశం నేతలనే నిందితులుగా చేయడం దారుణమని మండిపడ్డారు చంద్రబాబు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రోజంతా వైసీపీ మూకలు దాడులు చేస్తున్నా పోలీసులు బాధ్యతలు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల ఘటనలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయినా.. కారకులపై చర్యలు లేవని తప్పుబట్టారు. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో వైసీపీ శ్రేణులు, వారికి నాయకత్వం వహిస్తున్న గూండాలు స్వైర విహారం చేసినా పోలీసులు వారిని కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఘటనలో 40 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారని చంద్రబాబు ఆరోపించారు.
తెలుగుదేశం నేతలనే బెదిరించి, టార్చర్ పెట్టి.. వారిపైనే పోలీసులు తప్పుడు ఆరోపణలతో చివరకు జైల్లో పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేది వైసీపీ కుట్ర అన్నారు చంద్రబాబు.