Chandrababu Workshop to Candidates: రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ ముందుకెళ్తోంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రచించడంతో నిమగ్నమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఏ చిన్ని అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను విడుదల చేసింది. మరో ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో భాగంగా విజయవాడలోని ఎ కన్వెన్షన్లో నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్ఛార్జ్లతో వర్క్షాపు నిర్వహించారు. దీనికి టీడీపీతోపాటు జనసేన, బీజేపీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనిపిస్తోందన్నారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని మరోసారి గుర్తు చేశారు. ఏకైక అభిప్రాయంతో ముందుగా వచ్చింది జనసేన పార్టీ అని, పద్దతి ప్రకారం రాజకీయం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు.
సీట్లు రానివారు కష్టపడలేదని కాదని, రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారని సముదాయించారు చంద్రబాబునాయడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల హక్కులు, ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో 160కి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 సీట్లు కచ్చితంగా గెలవాలన్నారు. ఈసారి కడప కూడా మనదేనని మనసులోని మాట బయటపెట్టారు. కేంద్రంలో వందశాతం ఎన్డీయే వస్తుందన్నారు. సీట్లు రాని మూడు పార్టీల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేస్తే దాడులకు తెగబడతారా? అంటూ ప్రశ్నించారు చంద్రబాబునాయుడు. మాధవీరెడ్డిపై గన్నవరంలో వైసీపీ మూకల దాడిని ఖండిస్తున్నట్లు సోషల్మీడియా వేదికగా తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా ఈడీ ఫిర్యాదు చేసేందుకు మాధవీరెడ్డి ఫోటోలు తీస్తుంటే దాడికి తెగబడిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళా నేతపై దాడిని అడ్డుకోకపోగా, ఆమెనే స్టేషన్కు రావాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ఆరు అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా భీమిలి, చీపురుపల్లి, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం అర్బన్ వంటి ప్రాంతాలున్నాయి.