తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 2029 జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండున్నరేండ్ల ముందే పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. యువగళం పేరిట పాదయాత్ర చేసి 2024లో పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యభూమిక పోషించిన మంత్రి నారా లోకేశ్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆయనతో పాటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పల్లా శ్రీనివాస రావును కొనసాగించారు.దీనికితోడు మరికొంతతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల స్థాయి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎవరూ ఊహించని విధంగా కిందిస్థాయి లీడర్లకు చంద్రబాబు పెద్దపీట వేశారు.
నారాలోకేశ్ ప్రస్తుతం విద్యా, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మరోవైపు పార్టీ బాధ్యతలు సైతం చూస్తున్నారు. తాజాగా ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడంతో.. అదనపు బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. కేబినెట్ మంత్రిగా శాఖల బాధ్యతలు చూస్తూనే పార్టీ మంచి చెడు,నియామకాలను ఆయనే చూడనున్నారు.వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ పాత్ర కీలకంగా మారనుంది. పార్టీ సమావేశాలు,సభలు, క్రియాశీలక రాజకీయాలను ఆయనే పర్యవేక్షించనున్నారు. ఎవరైనా పార్టీ గీత దాటితే వారి తోక కత్తిరించే పవర్ ఆయన సొంతం. ఇంతకాలం చంద్రబాబే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేవారు. ఇప్పుడు మంత్రి నారాలోకేశ్ ఆ బాధ్యతలను సైతం చూడనున్నారు.
రాబోయే ఎన్నికల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈసారి 2029లో జమిలి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు రేపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడంది. సీఎం చంద్రబాబు.. ఇప్పటికే పలు పార్టీలకు ఆయన లేఖలు రాశారు. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని అందులో కోరారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పెంపు సైతం జరిగితే రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు అంశాన్ని సైతం నారా లోకేశ్ పర్యవేక్షణలో జరగనుంది.
వైసీపీ ఎంపీలపై ఫైర్.. జగన్పై ప్రేమ.. విజయసాయిరెడ్డి అసలు ప్లాన్ ఏంటి?
చంద్రబాబు అందుబాటులో లేనప్పుడు పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వంలోనూ నారాలోకేశ్దే కీ రోల్ కానుంది. వయసు రీత్యా చంద్రబాబు నెమ్మదిగా పార్టీ బాధ్యతలను ఇతరలకు అప్పగిస్తు వస్తున్నారు. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును తనయుడు లోకేశ్కు అప్పగించారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లోకేశ్ చాలా శ్రమించారు. ఎన్నికలకు మరో రెండేండ్లే సమయం ఉండటంతో ఇప్పుడే బాధ్యతలు అప్పగించారు. ఇప్పటినుంచి వచ్చే ఎన్నికల కోసం చినబాబు పార్టీ భవిష్యత్ ప్రణాళికలను రచించనున్నారు. ప్రభుత్వంలోనూ భాగమై మంత్రిగా ఆయన తన బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, యువనేతకు కీలక బాధ్యతలు అప్పగించడంతో తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.