CM Chandrababu Naidu: ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత కీలకమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని పలు కీలక ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడంతో పాటు, ‘విశాఖ ఎకనామిక్ రీజియన్’ (VER) అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.
ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం.. నిర్మాణ దశలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనులు, రాయపూర్-విశాఖ జాతీయ రహదారి, పోర్టులు, తీర ప్రాంత రహదారుల నిర్మాణ పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఐటీ హిల్స్, కీలకమైన కనెక్టివిటీ ప్రాజెక్టులను గమనించి, అధికారుల నుంచి వాటి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విశాఖపట్నంలో మంత్రులు, వీఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లతో మాస్టర్ ప్లాన్పై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ను 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. ఈ రీజియన్ పరిధిలో రోడ్లు, రైల్వేలు, లాజిస్టిక్స్, పోర్టులకు సంబంధించి మొత్తం 49 కీలక ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. వాణిజ్యం, పర్యాటకం, ఐటీ, వైద్యం, వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్ వంటి వివిధ శాఖలవారీగా వేర్వేరుగా యాక్షన్ ప్లాన్లను రూపొందించారు.
ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ తదితర 9 జిల్లాల కలెక్టర్లు ఈ సమీక్షకు హాజరయ్యారు.
Read Also: Cognizant Vizag: విశాఖ ఇక విశ్వనగరం.. కాగ్నిజెంట్ రాక చారిత్రక మైలురాయి: మంత్రి లోకేష్