CM Chandrababu: ఏపీకి పెట్టుబడులు రప్పించే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తోంది సీఎం చంద్రబాబు టీమ్. కేవలం పెట్టుబడులను రప్పించడమేకాకుండా తెలుగు భాషను విస్తరించే ఆలోచన చేస్తున్నారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో తెలుగు భాషను ద్వితీయ భాషగా గుర్తించాలని ఆదేశాన్ని కోరారు.
విదేశీ భాషలు నేర్చుకోవడమేకాదు.. తెలుగు భాషపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారు. ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తున్నారు ఆయన. ఆదివారం ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నివసిస్తున్న తెలుగు కమ్యూనిటీలు పలు విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. సింగపూర్లో తెలుగును సెకండ్ భాషగా గుర్తించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. సింగపూర్లో బెంగాలీ, తమిళం, హిందీ భాషలు ద్వితీయ భాషలుగా గుర్తించబడ్డాయి. తెలుగును ద్వితీయ భాషగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లోని భారత హైకమిషన్ను కోరారు.
ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి సంస్థల తెలుగు సంతతికి చెందిన వ్యక్తుల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి సిఎక్స్ఓ క్లబ్ను ప్రారంభించారు. సింగపూర్లో నాలుగు అధికారిక భాషలున్నాయి. వాటిలో ఇంగ్లీష్, మాండరిన్, తమిళం, హిందీ వంటి భాషలున్నాయి. అక్కడి పాఠశాలల్లో మాతృభాషలుగా హిందీ, పంజాబీ ఉన్నాయి.
ALSO READ: 20 వేల కోట్లతో ఏపీకి వచ్చే భారీ ప్రాజెక్టులివే?
సింగపూర్లో దాదాపు 40 వేల మంది తెలుగు సంతతికి చెందినవారు ఉన్నారు. అక్కడి ‘వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్’లో దాదాపు 2 వేల మందితో డయాస్పోరా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సింగపూర్ నుంచే కాకుండా మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వంటి వివిధ దేశాల నుండి వచ్చిన తెలుగు కంపెనీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు.
తెలుగు సంతతికి చెందిన ప్రజలు 128 దేశాలలో దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. తెలుగు ఎన్నారైలు ప్రతీ ఏటా రాష్ట్రానికి దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయలను పంపిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలో సింగపూర్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల మధ్య విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పారు.
దీనిపై కేంద్రంతో తాను చర్చిస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఏపీకి 20 కొత్త సముద్ర ఓడరేవులు, 15-20 కొత్త విమానాశ్రయాలు వస్తాయన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తోందని, త్వరలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేస్తామన్నారు.
పనిలో పనిగా ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం గురించి వివరించారు. గ్రామాల్లోని పేదలను దత్తత తీసుకోవడం ద్వారా పేదరిక నిర్మూలన మిషన్కు దోహదపడాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.