Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్లో ప్రస్తావించింది.
విశాఖ రైల్వేజోన్పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
విశాఖ జోన్ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖలో కలుపుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖలో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుతుందన్నారు.
సీఎం చంద్రబాబు హర్షం.. జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు
నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్- రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని రాసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి- ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుందన్నారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి గెజిట్ విడుదల చేసిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయాల నిర్మాణం పనులు ఆరిలోవలో జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీఎంఆర్డీఏ భవనంలోని రెండు అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసిన విషయం తెల్సిందే.
ALSO READ: సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ..దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా?
2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం పొందడంతో అదే నెలలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. జోన్ కార్యకలాపాలకు కీలకమైన అధికారుల నియామకం జరిగిపోయింది. చీఫ్ మెకానికల్ ఇంజినీర్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, చీఫ్ ఇంజినీర్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం జరిగిపోయింది.
ఇతర డివిజన్ల నుంచి 3వేల మంది విశాఖ జీఎం కార్యాలయంలో పని చేయడానికి ఆసక్తి చూపారు. జీఎం కార్యాలయంలో 1200 మంది సిబ్బంది అవసరం ఉంది. జోన్ కార్యకలాపాల తర్వాత దాదాపు 17వేల మంది వరకు సిబ్బంది పని చేయనున్నారు.