Mission Telangana స్వేచ్ఛ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన అనూహ్యమైన బూస్ట్తో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన పూర్తి ఫోకస్ను తెలంగాణపైకి మళ్లించింది. ఢిల్లీ పెద్దల కన్ను ఇప్పుడు భాగ్యనగరంపై పడింది. ‘మిషన్ తెలంగాణ’ పేరుతో దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే పరమావధిగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న స్తబ్దతను వీడి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ‘మిషన్ తెలంగాణ’ మంత్రాన్ని వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్లో సాధించిన ఫలితాలు తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడ అనుసరించిన దూకుడు వ్యూహాలనే ఇక్కడ కూడా అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. బెంగాల్ గెలుపు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదని, అది తెలంగాణలో అధికార మార్పిడికి నాంది అని కేడర్ బలంగా నమ్ముతోంది. ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి వేదిక కాబోతోంది. మోడీ రాకతో కేడర్లో నూతనోత్సాహం నింపడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరికలు పంపడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. మోడీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారనున్నాయి.
Also Read: కడపలో కిరాతకం.. భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం కలిపి చంపిన భర్త
ప్రధాని పర్యటన ముగియడమే తరువాయి.. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కాషాయ దళం చెబుతోంది. ఇతర పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అసంతృప్త నేతలు, బలమైన ప్రజాబలం ఉన్న నేతలను ఆకర్షించడం ద్వారా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఈ భారీ చేరికల పర్వం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులకు దారితీయనుంది. మొత్తానికి, బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడలు చూస్తుంటే తెలంగాణలో రాజకీయ పోరు రసవత్తరంగా మారబోతోందని అర్థమవుతోంది. మోడీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మారుతుందో వేచి చూడాలి.
Also Read: హైదరాబాద్కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!