Tirupati: బుధవారం మీడియా ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న గొడ్డలి పార్టీతో జాగ్రత్త అంటూ ప్రజలకు వివరించారు. ఆ పార్టీతో జాగ్రత్త అని, రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి ఓకే చెప్పి, ఆ తర్వాత మూడుముక్కలాటకు దిగారన్నారు. ఎన్నికలు కాగానే మావిగన్ అంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.
వీబీ జీరామ్జీ పథకం ప్రారంభంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి
తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీ జీ రామ్ జీ పథనానికి శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాల్, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలసి ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన, రాజధాని అమరావతేనని, అది దేవతల రాజధాని అని మరోసారి వెల్లడించారు.
గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం, విశాఖకు రైల్వే జోన్ సాధించామన్నారు. ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పకనే చెప్పారు. గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్రం నాంది పలికిందన్నారు. గ్రామాల ముఖచిత్రాన్ని వీబీ జీరామ్జీ కార్యక్రమం మారుస్తుందని అన్నారు.
వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు
గతంలో ఉపాధి హామీని రాయలసీమ నుంచి ప్రారంభించారంటూ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మెరుగైన సవరణలు చేసి వీబీ జీరామ్జీ పేరుతో తీసుకొచ్చారన్నారు. గాలేరు-నగరి కాల్వను కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత మాదన్నారు. జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచేలా చేశామని, ఎంజీనరేగాలో కేంద్ర-రాష్ట్రాల వాటా 90-10 గా ఉండేదన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయని, ఒకే సారి గ్రామసభలు ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ పథకం కింద అభివృద్ధి పనులు చేసుకోవచ్చని, భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చన్నారు. 100 రోజుల నుంచి 125 రోజులకు ఈ పనిని పెంచడం సంతోషమని, దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానం తీసుకొచ్చారు.
ALSO READ: వాతావరణ శాఖ చల్లని కబురు.. వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!
పేదరిక నిర్మూలనలో భాగం వీబీ జీ రామ్ జీ పథకమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రం సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధి కార్మికులకు అదనంగా 25 రోజులు కల్పించామన్నారు. వ్యవసాయ సీజన్లో రెండు నెలలపాటు రైతులకు ఉపయోగపడుతుందన్నారు.
ఏపీలో పథకం అమలుకు రూ.12,845 కోట్లు ఖర్చు అవుతుందని, గడిచిన రెండేళ్లలో వివిధ కార్యక్రమాలకు రూ.16,695 కోట్ల ఉపాధి నిధులను ఉపయోగించామన్నారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీ జీరామ్జీ పథకం తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. గ్రామాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని తేల్చేశారు.
ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం రూ.2 కోట్లు ఇస్తున్నామని, చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదనే మార్పులు చేపట్టినట్టు తెలియజేశారు. కార్మికుడి కష్టానికి న్యాయం చేయాలని భావించామని, నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. గ్రామాల వికాసానికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ పనులు చేయాలన్నా గ్రామాలకే అధికారం ఇచ్చామన్నారు. ఏ పనులు చేయాలన్నా స్థానికంగా నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు.