ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగిన గ్రామ సభలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై సీఎం ఫైర్
రాయవరం గ్రామ సభలో మొత్తం 900 మంది రైతులకు పాస్ పుస్తకాలు మంజూరయ్యాయి. అయితే, సభకు వచ్చిన రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మంజూరైన పుస్తకాలు లబ్ధిదారులకు సకాలంలో చేరకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆశయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ను పిలిచి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.
రైతులకు అందజేసే పాస్ పుస్తకాలను వారి ఇళ్ల వద్దనో లేదా కార్యాలయాల్లోనో కాకుండా.. పారదర్శకంగా అందరి ముందూ గ్రామ సభల్లోనే పంపిణీ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘రైతు భూమిపై వారికే పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదు’ అని ఆయన పేర్కొన్నారు. కేవలం అధికారులే కాకుండా.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ పంపిణీ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు.
రాజముద్రతో కొత్త పాస్ బుక్లు..
గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై ఉన్న ఫోటోలు, గుర్తుల వివాదం నేపథ్యంలో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పుస్తకాల పంపిణీ వేగంగా జరుగుతోంది. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా వారి భూమికి భద్రత కల్పించేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం వివరించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిర్లిప్తంగా ఉండటంపై ఆయన సీరియస్ అయ్యారు.
చివరగా.. భూ హక్కుల విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయని పక్షంలో ఉన్నతాధికారులపై కూడా చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు.
ALSO READ: Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన