CM Chandrababu : చంద్రబాబు మారిన మనిషి. డైలీ అప్డేట్ అయ్యే మారే మనిషి. చంద్రబాబు 2.0.. 3.0 లు కాదు.. ఇప్పుడంతా బాబు గారి లేటెస్ట్ వెర్షన్. డ్రోన్ టెక్నాలజీలు, P4 స్ట్రాటజీలు, నలుగురు పిల్లలు.. ఇలా ప్రస్తుతం విజన్ 2045 నడుస్తోంది. చంద్రబాబు లాస్ట్ టర్మ్ పాలనలో కొన్ని అంశాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారనే ఆరోపణ ఉండేది. అప్పటిలా అధికారులతో గంటల తరబడి సుదీర్థ సమీక్షలు ఇప్పుడు లేవు. సూటిగా.. సుత్తి లేకుండా.. చకచకా రివ్యూలు, నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అప్పుడంతా అమరావతి, పోలవరం చుట్టూ షూ అరిగేలా తిరిగేవారు చంద్రబాబు. ఇప్పుడు నవ్యాంధ్ర నయా రాజధానికి ప్రయారిటీ ఇస్తూనే.. సంక్షేమం, ఆర్థికం, సాంకేతిక అంశాలపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. త్వరలోనే ప్రధాని మోదీతో అమరావతి 2.0 పనులు స్టార్ట్ కాబోతున్నాయి. లేటెస్ట్గా పోలవరం ప్రాజెక్టుకూ టార్గెట్ డిజైడ్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఏరియల్ వ్యూ నిర్వహించారు. నిర్వాసితులతో మాట్లాడారు. 2027 జూన్ నాటికల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అంటే.. మరో రెండున్నర ఏళ్లలో ఆంధ్రుల చిరకాల స్వప్నం పూర్తవుతుందన్నమాట. గోదారమ్మ పోలవరం పొంగులు చూడొచ్చన్నమాట.
సోమవారం.. పోలవారం.. కట్ చేస్తే..
2014-2019 కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంపై పూర్తిగా దృష్టి పెట్టారు. సోమవారంను పోలవారంగా మార్చేసుకుని.. ప్రతీ మండే పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ చేసేవారు. చంద్రబాబు అంటే పోలవరం.. సోమవారం.. పోలవారం.. అనేలా ఫిక్స్ అయిపోయిందలా. ఆ టర్మ్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినా.. అప్పట్లో కేంద్రంతో వచ్చిన గ్యాప్ వల్ల నిధులు, పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. అంబటి రాంబాబు లాంటి వాళ్లు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. పోలవరంను అంతా మర్చిపోయేలా చేశారు.
Also Read : సజ్జల ఎక్కడ? వైసీపీలో అసలేం జరుగుతోంది?
కట్ చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చింది. సీఎంగా చంద్రబాబు మళ్లీ పోలవరంను పట్టాలెక్కించారు. అయితే.. సోమవారం.. పోలవారం మాత్రం ఇప్పుడు లేదు. ఆనాడు అంతగా సోమవారం సెంటిమెంట్ ఫాలో అయిన చంద్రబాబు.. ఈసారి సెంటిమెంట్ కంటే ప్రాక్టికాలిటీయే మెయిన్ అనుకున్నారేమో. అందుకే, ఈ గురువారం పోలవరంలో పర్యటించారు. సోమవారం కాకుండా మరో రోజు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు రివ్యూ చేయడం ఆసక్తికరంగా మారింది. బాబు మారిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. మార్పు మంచికేనని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
అమరావతి, పోలవరం మాత్రమే కాకుండా.. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్గా వర్క్ చేస్తున్నారు సీఎం చంద్రబాబునాయుడు. సోలార్, డ్రోన్, ఏఐ టెక్నాలజీ, వాట్సాప్లో సేవలు, పీ4 పాలసీతో దూసుకుపోతున్నారు. ఏపీ, బిల్గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదరడం ఏపీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయనటానికి నిదర్శనం అంటోంది టీడీపీ. వీటితో పాటూ అమరావతి, పోలవరం. అది సోమవారమైనా కానీ.. ఏ రోజైనా కానీ. పని ఇంపార్టెంట్. ప్రాజెక్టులు కంప్లీట్ కావడం ముఖ్యం. అందుకే, సోమవారం పోలవారం సెంటిమెంటుకు ఇప్పుడు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వట్లేదని లేటెస్ట్ పర్యటనతో తేలిపోయింది. స్లో అండ్ స్టడీగా.. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అంటున్నారు.