CM Jagan discuss: వైసీపీ నినాదం వై నాట్ 175.. కానీ ఆ నినాదాన్ని వైసీపీ అధినేత పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సర్వేలన్నీ కూటమి వైపు మొగ్గు చూపడంతో ఏం చేయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారట. ఈ క్రమంలో రకరకాల సమస్యలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తాజాగా దళితుల శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులను దోషిగా న్యాయస్థానం తేల్చింది. ఆ తర్వాత ఆయన బెయిల్పై బయటకు రావడం జరిగిపోయింది. అయితే ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ సీరియస్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులోభాగంగా కీలక నేతలతో ఈ అంశంపై జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. తోటను పక్కన బెడితే ఎలా ఉంటుందని అన్నారట. ఆయన్ని కంటిన్యూ చేస్తే దళిత ఓట్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారట. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. తోటను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కొన్ని దళిత సంఘాలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు వైసీపీకి ఇన్ఫుట్స్ వచ్చినట్టు సమాచారం. దీనికితోడు మంగళవారం ఓ సంస్థ వెల్లడించిన సర్వేలో వైసీపీకి ఓట్ల శాతం పడిపోతుందని తేల్చేసింది. మెజార్టీ ఎంపీ సీట్లను కూటమి గెలుచుకుంటుందని బయటపెట్టింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల చాపుకింద నీరులా విస్తరించడం గమనించిన జగన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మండపేట సీటు నుంచి తోటను తప్పించి మరో వ్యక్తికి ఇస్తే ఎలా ఉంటుందని నేతలతో అన్నట్లు అంతర్గత సమాచారం. ఇంకా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు. మరో రెండురోజులు సమయం ఉంది. ఈలోగా ఏదైనా నిర్ణయం జగన్ తీసుకోవచ్చని ఆ పార్టీలోని నేతలే చెబుతున్నారు. బుధవారం లేదా గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్ బస్సుయాత్ర జరగనుంది. ఈ విషయమై తోటతో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఈ వ్యవహారంపై తోట ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.