CM Jagan: సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబును నమ్మడమంటే.. పడుకున్న చంద్రముఖిని నిద్రలేపడమేనని ఎద్దేవా చేశారు.
14 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అంటూ ప్రశ్నించారు. పేదల కోసం చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీపై సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
2014లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల మాఫీ చేయలేదని విమర్శించారు.
ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీలిచ్చిన చంద్రబాబు గతంలో ప్రజలను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
Also Read: నాగబాబు వార్నింగ్ వెనుక.. మేం పోలీసు బిడ్డలం..!
మోసకారి చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమేనని, పులినోట్లో తల పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తాము ఐదేళ్లుగా అమలు చేస్తున్న పథకాలు గంగలో కలిసిపోతాయని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజల తలరాతను మార్చే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి మంచి చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలని జగన్ కోరారు.