YS Jagan Speech in Repalle : వారం రోజులలో ఏపీలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని, వైసీపీకి ఓటేసి గెలిపిస్తేనే పథకాలు కొనసాగుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం రేపల్లెలో ఎన్నికల ప్రచార భేరీని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఓటువేయడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని మళ్లీ పాతపాటే అందుకున్నారు.
ఈ ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం మాత్రమే కాదని, ఐదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని తెలిపారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలన్నీ ముగిసిపోయినట్లేనన్నారు. బాబును నమ్మితే.. కొండచిలువ నోటిలో మనమే తలపెట్టినట్లని వ్యంగ్యం ప్రదర్శించారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు.. ఏనాడూ పూర్తిగా మేనిఫెస్టోను అమలు చేసిన పాపాన పోలేదన్నారు. 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని తెలిపారు.
Also Read : అల్లుడి వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్.. పవన్ కల్యాణ్ నీకిది తగదు..
విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి.. పిల్లల చదువుల ఫీజులు కూడా కడుతున్న ప్రభుత్వం వైసీపీ అని పేర్కొన్నారు. వైసీపీ అమలు చేసిన పథకాలు ఇంతవరకూ ఏ రాష్ట్రప్రభుత్వం చేయలేదన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థతో సమూల మార్పులు తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల ప్రభుత్వ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు పేరు చెబితే.. మచ్చుకైనా ఒక అభివృద్ధి పనిగాని, ఒక స్కీమ్ గాని గుర్తురాదని విమర్శించారు.
2014 కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని దూషించారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల రద్దు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ.2 వేలు, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవ్ లూమ్స్ రుణాల మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు.. ఇవేవీ జరగలేదని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒక పంటపొలమైతే.. దానిని సాగుచేసే బాధ్యతను జగన్ అనే రైతుకి ఇవ్వాలని ప్రజలను కోరారు.