COVID-19 Returns: ఏపీలో రెండో కరోనా కేసు బయటపడింది. కడప రిమ్స్లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో రిమ్స్లో చేరిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. బాధితుడు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇప్పటికే విశాఖలో ఒక కరోనా కేసు నమోదైంది. కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదం కనిపిస్తుండటంతో.. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
విశాఖపట్నంలో తొలికేసు నమోదు
కాగా.. విశాఖపట్నంలో గురువారం నాడు కోవిడ్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే.. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అయితే.. ఆ మహిళకు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులకు నెగెటివ్ అని తేలింది. ఆమెను వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని డాక్టర్లు సూచించారు. మహిళ ఇంటి పక్కల ఉన్నవారందరికీ కరోనా టెస్టులు చేయాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిక
కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఇప్పటి నుంచే మాస్కులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 95, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 55, కర్ణాటకలో 13, పాండిచ్చేరిలో 10 కొత్త కేసులు ఉన్నాయి. దీంతో మరోసారి వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే ప్రమాదం ఉండదని వైద్యుల సూచన.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ 19
కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. కోవిడ్ 19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో ఇంకా జనం మర్చిపోలేదు. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునే లోపు ఆ మహమ్మారి నేనున్నా అంటూ.. ఏదొక రూపంలో కన్నెర్ర జేస్తుంది.
హాంకాంగ్, సింగపూర్లో నమోదవుతున్న కొత్త కేసులు
ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లో కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానిక అధికారులు, ప్రజలు అప్రమత్తం చేశారు. హాంకాంగ్లో కొత్త కేసులు నమోదవ్వడమే కాకుండా.. మరణాలు కూడా సంభవించడం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.
ఒకే వారంలో హాంకాంగ్లో 31 కోవిడ్ మరణాలు
మే 3తో ముగిసిన వారంలో 31 కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయని అధికారులు తెలపారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కోవిడ్ మరణాలు సంభవించడం ఇదే తొలిసారని అన్నారు అధికారులు. రెండేళ్ల క్రితం నాటి కేసులో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో వైరస్ వ్యాప్తి వేగంగానే ఉందని భావిస్తున్నారు.
సింగపూర్లో ఒకే వారంలో 14,200 కేసులు
ఇక సింగపూర్లోనూ కోవిడ్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. అక్కడ దాదాపు ఏడాది తరువాత కొత్త కేసులు నమోదువుతున్నాయి. మే3తో ముగిసిన వారంలో 14వేల 200 కేసుల వెలుగు చూశాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 28 శాతం ఎక్కువని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని చెప్పారు. ఏపీలో పలు ప్రాంతాల్లో కోవిడ్ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
వ్యక్తిగత జాగ్రత్తలు
-తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
-తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి లేదా సానిటైజర్ ఉపయోగించాలి.
-కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.
-కళ్ళు, ముక్కు, నోటి వెంట చేతులు పెట్టకండి.
ఆరోగ్య సంరక్షణ:
-జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.
-ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలి.
-పోషకాహారం, విటమిన్ C, ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఇతర సూచనలు:
-గుంపులుగా చేరకండి – ప్రత్యేకించి ముసలివారు, పిల్లలు గుంపుల్లో ఉండకుండా చూసుకోండి.
-ఇంటి నుండి బయటకు అవసరమైతే మాత్రమే వెళ్లండి.
-ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు పాటించండి.
ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఇతరులకు వ్యాపించకుండా నిరోధించవచ్చు.