Janasena Party: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటే సపరేట్. రాజకీయాల్లోకి అడుగిడిన సమయం నుండి, ఇంతింతై వటుడింతై అన్న చందంగా పార్టీ అధ్యక్షుడి హోదా నుండి డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు. తనదైన శైలిలో ప్రజాసేవలో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ దశలో పార్టీ విజయానికి అండగా నిలిచిన జనసేన క్యాడర్ ను మరింతగా బలోపేతం చేసేలా ఇటీవల పవన్ పావులు కదుపుతున్నారు. అందుకే జనసేన పార్టీ క్యాడర్ తో కూడ పవన్ తరచూ టచ్ లో ఉంటున్నారట. అయితే పవన్ కన్ను ప్రకాశం జిల్లాపై పడిందని తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది.
వైసీపీకి టాటా చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో మంత్రిగా కూడ బాలినేని భాద్యతలు నిర్వహించారు. జగన్ కుటుంబానికి సమీప బంధువైన బాలినేని చేరికతో, ప్రకాశంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. అయితే బాలినేని వెళ్లిన వెంటనే, దిద్దుబాటు చర్యల్లో భాగంగా జగన్ కూడ, జిల్లా వైసీపీ అధ్యక్ష బరిలోకి దర్శి ఎమ్మేల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రంగంలోకి దింపారు.
కానీ జనసేనలో చేరిన బాలినేనికి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నటి వరకు భాలినేనికి ఎమ్మెల్సీ దక్కనున్న్నట్లు ప్రచారం కూడ సాగింది. ఈ ప్రచారంపై బాలినేని క్లారిటీ కూడ ఇచ్చారు. తమ అధినేత పవన్ చెప్పినట్లుగా వింటానని, పార్టీ కార్యకర్తగా పని చేసేందుకు కూడ తాను సిద్ధమన్నారు. ఇక్కడి వరకు ఓకే గానీ ఇటీవల ప్రకాశం జిల్లాలో జనసేనలోకి భారీ చేరికలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ ను బాలినేని కలిసిన సమయంలో పార్టీ చేరికల గురించి పెద్ద చర్చ సాగిందట. ఫిబ్రవరి 5న ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన బాలినేనికి, తాను కచ్చితంగా బహిరంగ సభలో పాల్గొంటానని పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీపరమైన కార్యక్రమం కావడంతో బాలినేని కూడా తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Also Read: Lady Aghori: మళ్లీ అఘోరీ హల్చల్.. పెట్రోల్ క్యాన్ తో బెదిరింపులు..
అయితే ఇప్పటికే భారీ చేరికలకు బాలినేని స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారని, ఇక బహిరంగ సభ జరగడమే తరువాయి అంటూ ప్రకాశం జిల్లాలో చర్చలు ఊపందుకున్నాయి. ఏదిఏమైనా జిల్లాలో జనసేన క్యాడర్ ను బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో.. పవన్ కన్ను ప్రకాశం జిల్లాపై పడిందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. అయితే పవన్ ప్రకాశం పర్యటన గురించి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అలాగే మరో ప్రచారం కూడ జిల్లాలో సాగడం విశేషం. ఈ చేరికలు జనసేన ప్రధాన కార్యాలయంలో సాగుతాయని కూడ ప్రచారంలో ఉంది.