EC Issued Notices to Sharmila: ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కన్నేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. విమర్శలు చేసేటపుడు ఆచితూచి వ్యవహరించాలని చెప్పినా వినని వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల వివేకా హత్యకేసులో ఆరోపణలు చేసిన ఆమెపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు.. వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ షర్మిలకు నోటీసులు పంపింది. కాంగ్రెస్ నుంచి కడప లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల.. ప్రచారంలో భాగంగా వైసీపీ నేతలపై వివేకా హత్యకేసులో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
అవినాష్ సహా ఇతరుల పాత్రలపై విమర్శలు చేస్తుండటంతో.. వివేకా కేసుపై ప్రచారంలో వ్యాఖ్యానించవద్దని కడప కోర్టు సైతం ఆదేశాలిచ్చింది. తాజాగా ఇదే విషయమై నోటీసులు జారీ చేసిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read: త్వరలో.. హైకోర్టును ఆశ్రయిస్తా: వైఎస్ సునీత
శుక్రవారం చేసిన ఎన్నికల ప్రచారంలోనూ షర్మిల వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ పై విమర్శలు గుప్పించారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర భవిష్యత్ మరోలా ఉండేదన్నారు. ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. ఇప్పుడు మనకున్నది కేవలం చేతిలో చిప్ప మాత్రమేనన్నారు. రాష్ట్రం అభివృద్ది కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు షర్మిల.