AP DSC 2025: AP DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితి(వయస్సు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 42 ఏళ్లు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడది 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వయో పరిమితి పెంపు కేవలం డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుంది. దీనికి కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. గడిచిన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ రిక్రూట్మెంట్ నిర్వహించలేదు. కేవలం సచివాలయం ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. దీనివల్ల డీఎస్సీ అభ్యర్థులను చాలా ఇబ్బందులు పడ్డారు. తమ పరిస్థితి ఏంటని లోలోప కుమిలిపోయారు.
తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడే కాదు 2014-19 మధ్యకాలంలో టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ మెంట్ చేసింది. విభజన తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్పుడు కూడా అభ్యర్థులకు వయస్సు రిలీఫ్ ఇచ్చిన విషయం తెల్సిందే.
ఇక మెగా డీఎస్సీ విషయానికి వద్దాం. ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని స్థానికులకు 80 శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు ఉన్నాయి.
ALSO READ: టైమ్, డేట్ ఫిక్స్.. ఆ రోజు అమరావతిలో మోదీ ఏం చేస్తారంటే
ఎస్సీ సంక్షేమ శాఖలో 439, బీసీ సంక్షేమ శాఖలో 170 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎస్టీ సంక్షేమ శాఖలో 2024 ఖాళీలను గుర్తించింది. దీనికితోడు సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఈ రిక్రూట్మెంట్లో ఉండనున్నాయి.
మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు- 6,371 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్-1,781 పోస్టులు ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్-286, ప్రిన్సిపాల్ పోస్టులు-52, వ్యాయామ ఉపాధ్యాయులు-132 పోస్టులకు ఉన్నట్లు సమాచారం. డీఎస్సీ అర్హత పరీక్ష టెట్ను ఇప్పటికే నిర్వహించింది ప్రభుత్వం. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది.
గత నెలలో డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి వుంది. అయితే ఎస్సీ వర్గకరణ నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చింది. దీనిపై గురువారం ఆర్డినెన్స్ జారీ చేయడంతో అడ్డంకులు తొలిగిపోయాయి. వీలైతే ఈ వారం లేకుంటే వచ్చే వారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.