 
					Tirumala Laddu: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట్ తో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్ ప్రస్తావించింది. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చింది.
టీటీడీ కొనుగోళ్ల విభాగం (Procurement Dept) జనరల్ మేనేజర్ (GM) ను 2022 లో అప్పన్న సంప్రదించాడు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అన్ని కంపెనీల వివరాలను తీసుకున్నాడు. టీటీడీ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా భోలే బాబా డైరీ యాజమాన్యానికి అప్పన్న ఫోన్ చేశారు. బోలే బాబా కంపెనీ ప్రతినిధి పీపీ శ్రీనివాస్కు కాల్ చేశాడు. టీటీడీకి సరఫరా చేసే ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు భోలే బాబా డైరీ యాజమాన్యం కమీషన్ ఇవ్వడానికి నిరాకరించింది.
బోలేబాబా డైరీని అనర్హులుగా ప్రకటించేలా చేయడానికి అప్పన్న కుట్ర చేశాడు. బోలేబాబా డైరీ తనిఖీలు చేయాలంటూ టిటిడి ప్రొక్యూర్ మెంట్ జీఎమ్ పై ఒత్తిడి తెచ్చాడు. భోలే బాబా డైరీని అనర్హులుగా ప్రకటించే ప్రయత్నంలో డైరీకి వ్యతిరేకంగా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించాడు. అప్పన్న ఒత్తిడి తేవడం.. కుట్రలతో బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసింది. భోలే బాబా డైరీ టెండర్ల నుంచి తొలగిపోవడంతో ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రవేశించింది. బోలేబాబా డైరీ కంటే కిలో కు రూ.138 ఎక్కువ కోట్ చేసింది ప్రీమియర్ అగ్రిఫుడ్స్. పోటీ లేకపోవడంతో టీటీడీ నుంచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును అగ్రిఫుడ్స్ దక్కించుకుంది.
చిన్న అప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు విచారణలో సిట్ అధికారులు గుర్తించారు. ప్రీమియర్ ఆల్ఫా కంపెనీ సంబంధం ఉన్న హవాలా ఏజెంట్ ద్వారా అప్పన్నకు చేరినట్లు విచారణలో బయటపడింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రమోటర్లతో అప్పన్న నిరంతరం సంప్రదించినట్లు అధికారులు గుర్తించారు. అప్పన్న బ్యాంకు లావాదేవీలను పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చింది సిట్. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కుట్రను ఛేదించేందుకు అప్పన్నను సిట్ కస్టడీకి కోరనుంది. మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అక్రమాలను సిట్ గుర్తించింది.
ALSO READ: Jio-Google Gemini Pro: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త… 18 నెలల పాటు ఉచితమే!
భోలే బాబా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ నెయ్యి నమూనాలను పరీక్షించాలని 2022 లో అదేశాలు జారీ చేసింది. ఛైర్మన్ ఆదేశాలతో నెయ్యి నమూనాలను సీఎఫ్టీఆర్ఐ-మైసూరుకు టీటీడీ పంపింది. మైసూర్ సీఎఫ్ టిఆర్ఐ ల్యాబ్ నివేదికల్లో నెయ్యిలో వనస్పతి కల్తీలు ఉన్నట్లు నిర్ధారించారు. ల్యాబ్ నివేదికల్లో నెయ్యి కల్తీని ధృవీకరించినా అధికారులు చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి గుర్తించినప్పటికీ కూడా 2022-2024 మధ్య కొనసాగిన నెయ్యి సరఫరా కొనసాగింది.
రెండేళ్ల పాటు రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయినట్టు సిట్ అధికారులు తెలిపారు. గుత్తేదారు కల్తీ నెయ్యి సరఫరా ద్వారా కిలోకు కిలో సుమారు రూ.250 చొప్పున లాభాలు (profits) ఆర్జించినట్లు సిట్ గుర్తించింది. అప్పన్న విచారణతో వెలుగుచూసిన అంశాలతో మరికొందరిని నిందితులుగా చేర్చింది సిట్. మాజీ టీటీడీ ఛైర్మన్ పిఎ చిన్న అప్పన్నతో సహా తొమ్మిది మందిని కొత్త నిందితులుగా చేర్చింది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో మున్ముందు ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడుతాయో వేచి చూడాలి..
ALSO READ: Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, రైతన్నలు జర జాగ్రత్త..!