AP – GBS : కొంత కాలంగా దేశంలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ – బారీ సిండ్రోన్ (GBS) వైరస్ భారీన పడి మరణించిన తొలి కేసు రాష్ట్రంలో నమోదైంది. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిపై ఊహాగాహానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా అలసందల పల్లికి చెందిన కమలమ్మ గులియన్-బారీ సిండ్రోమ్ (జీబీఎస్)తో మరణించింది. ఈ మృతిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా.. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ కమలమ్మ మృతి చెందింది.
కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న కమలమ్మ.. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. తొలుత ఈ వైరస్ మరణంపై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతుండడంతో.. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి అధికారికంగా ధ్రువీకరించారు.
గులియన్-బారీ సిండ్రోమ్ (GBS) అనేక ఒక అరుదైన, తీవ్రమైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ వ్యాధి అని వైద్యులు తెలుపుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి వ్యాధి నిరోధక వ్యవస్థ స్వయంగా నరాల వ్యవస్థపై దాడి చేస్తుంది. బయటి నుంచి ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా, వైరస్ తో పోరాడాల్సిన వ్యాధి నిరోధకత.. సొంత వ్యవస్థ పైనే దాడి చేయడంతో.. బాధితులు తీవ్ర ఇబ్బందులు పడతారు. క్రమంగా ప్రాణాలు కోల్పోతారు.
ఈ వ్యాధి అరుదుగా.. లక్ష మందిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధి కేసులు ఇటీవల కాలంలో ఏపీలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత మరణం సంభవించిన జీజీహెచ్ ఆసుపత్రిలోనే ఈ నెల 11న ఒక్కరోజే ఏడు కేసులు నమోదయ్యాయి. కాగా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ఈ వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. కొవిడ్ లాగా ఇది అంటువ్యాధి కాదు అని వైద్యులు చెబుతున్నారు. కానీ.. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురైన వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని.. ఈ వైరస్ ఎక్కువగా కలుషిత ఆహారం, నీరు నుంచి వ్యాపిస్తుందని.. అందుకే బయట ఆహారం కానీ నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాల కారణంగా.. వైరస్ వ్యాప్తి ఎక్కవవుతున్న కొద్ది.. శరీరంలోని అన్ని కండరాలు చచ్చుబడి పోతాయి. అందుకే.. వ్యాధి లక్షణాల్ని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స పొందితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. సాధారణంగా పెద్దలు, మధ్య వయస్కులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి.. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు సైతం సోకుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
జీబీఎస్ వ్యాధి లక్షణాలు
వేళ్లు, మడమలు, మణికట్టు వంటి చోట్ల చిన్నగా నొప్పులు వస్తాయి. నిరంతరం తగ్గకుండా.. చిన్నపాటి నొప్పి వేధిస్తుంటుంది. మొదట్లో కాళ్లు, చేతులు నెమ్మదిగా బలహీనం అవుతాయి. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటగా అనిపించడం ప్రాథమిక లక్షణాల్లో కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. తర్వాతి దశలో సరిగ్గా నడవలేకపోవడం, తూలడం జరుగుతుంటుంది. ఈ దశలో ఎట్టిపరిస్థితుల్లో వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ దశ దాటితే.. నోరు వంకర పోవడం, మాట్లాడడం, నమలడం, మింగడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. శరీరంలో వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉంటే.. కంటి చూపు మందగిస్తుందని చెబుతున్నారు. కళ్లు కదిలించలేకపోవడం, పూర్తిగా మూయ లేకపోవడం దశకు చేరుకోవచ్చంటున్నారు. ఆ తర్వాతి దశలో శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. వారికి వెంటిలేటర్పై చికిత్స అందించాలని సూచిస్తున్నారు.
Also Read : కిరణ్ రాయల్ వద్ద పవన్ జాతకం.. లక్ష్మీ సంచలన ఆరోపణ