Rain Alert: ఏపీకి మరో వర్ష సూచనతో పాటు, భీకర గాలుల ఎఫెక్ట్ కూడా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనితో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే భీకర గాలుల సమయంలో గృహాలకే పరిమితం కావడం మంచిదని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై నిన్న అల్పపీడనం ఏర్పడగా, మరలా అదే ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ 25వ తేదీన వాయుగుండం గా మారి బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ.. తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు – శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది.
ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ కు మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే భీకర గాలులు విస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, 26వ తేదీన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు ఈరోజు రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారి ప్రకటించారు. ఎల్లుండి అనగా 26వ తేదీ వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పలు జిల్లాలలో కురుస్తాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఈరోజు రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, 26వ తేదీ ఉరుములతో కూడిన మెరుపులు అధికంగా ఉంటాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారు ప్రకటించారు.
Also Read: Long Hair Tips: జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనె ట్రై చేసి చూడండి.
ఈ విషయాన్ని ప్రజలు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు మెరుపుల సమయంలో బయట ఉండరాదని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. వర్షాలు కురిసే సమయంలో వ్యవసాయ మోటార్ల వద్దకు రైతులు వెళ్లకపోవడం మంచిదని, ఏదైనా సమస్యలు తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. కాగా ఓ వైపు ఇటీవల పెరిగిన చలిగాలులతో వృద్దులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సీజనల్ వ్యాధులు కూడా ప్రజలను బెంబేలెత్తిస్తుండగా, మరో వైపు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.