Heavy Temperatures Warning : దేశవ్యాప్తంగా సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు విసుగు చెందుతున్నారు. వేసవి ఎప్పుడెప్పుడు అయిపోతుందా.. వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత చంపేస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో.. మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
నడి వేసవిలో చిన్న చినుకు పడినా.. కొద్దిసేపు ఉపశమనం ఉంటుందేమోగానీ.. ఆ తర్వాత కాచే ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇప్పటి వరకూ ఐఎండీ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతాయి. తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 28న తెలుగు రాష్ట్రాల్లో మరో 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. గరిష్ఠంగా 40-45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు రాత్రివేళలో వేడిగాలులు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.
Also Read : రూ.35 వేల లోపు లభించే బెస్ట్ ఏసీలు.. మీరే ఓ లుక్కేయండి..!
భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. వీలైనంత వరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటలలోపు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. తెలంగాణలో గడిచిన రెండ్రోజుల్లో ముగ్గురు వడదెబ్బతో మరణించారు.